పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని రాజధాని నిర్మాణ ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో పర్యటించి రైతుల బాధల గాథలు విన్న తరువాత కొంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు.నిజానికి ఇది విచిత్రమైన పరిస్థితి అని కూడా చెప్పలేం.
ఆసక్తికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు.రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే మాత్రమే తీసుకోవాలని, బలవంతంగా తీసుకోకూడదని పవన్ ప్రభుత్వానికి విన్నవించాడు.
అసలు భూసేకరణ నోటిఫికేషన్నే రద్దు చేయాలని డిమాండ్ చేశాడు.ఆ పని చేయకుండా భూములు సేకరిస్తే తాను దీక్ష, ధర్నా చేస్తానని హెచ్చరించాడు.
అదే సమయంలో తాను టీడీపీ, భాజపాలకు మద్దతు కొనసాగిస్తానని కూడా అన్నాడు.మద్దతు విషయం ఎలా ఉన్నా, పవన్ వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.
రైతులు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ రెడ్డి అన్నారు.రెండు గ్రామాల వారు భూములు ఇవ్వనంతమాత్రాన రాజధాని నిర్మాణం ఆగదని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
ముప్పయ్మూడు వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు.ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడలేదు.
భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పవన్ డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? లేదా బలవంతంగా భూములు సేకరిస్తుందా? ఒకవేళ ఇదే జరిగితే పవన్ తాను అన్న ప్రకారం దీక్ష లేదా ధర్నా చేస్తాడా? ఒకవేళ పవన్ ఈ పని చేయకుంటే ప్రజలు అతన్ని ఇక ముందు విశ్వసిస్తారా? భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని, కాని పవన్ ‘ఇవ్వండి’ అని ఒక్క మాట చెబితే ఇచ్చేస్తామని రైతులు అన్నారట.పవన్ను ఇంతగా నమ్మిన రైతులు ఆయన తమను భూ సేకరణ నుంచి కాపాడతాడని ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ దారికి ప్రభుత్వం వస్తుందా? ప్రభుత్వం రూటులోకి పవన్ వెళతాడా?
.