ఏపీలో బీజేపీ – జనసేన పొత్తు పెట్టుకుని దాదాపు ఆరు నెలలు అవుతోంది.ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాక ఇప్పటివ వరకు కలిసి పనిచేసిన సందర్భాలు లేవు.
పొత్తు పెట్టుకున్న వెంటనే కరోనా వైరస్ వ్యాప్తితో ఎవరి దారుల్లో వారు ఉన్నారు.ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అయ్యి వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ మరో నాలుగేళ్ల పాటు తీరికలేనంత షెడ్యూల్ వేసుకుంటున్నారు.
ఇక ఈ రెండు పార్టీలు కలిశాక ఓ పెద్ద ఎన్నిక కూడా రాలేదు.
అయితే త్వరలోనే తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పనిచేయక తప్పదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేయాలనుకున్నా కరోనా కారణంగా ఆ ఎన్నికలు వాయిదా పడడంతో ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీకి రెడీ అవుతోంది.జనసేన – బీజేపీ కలిసి పనిచేసే తొలి ఎన్నికగా తిరుపతి ఉప ఎన్నిక నిలవబోతోంది.
వాస్తవంగా చూస్తే తిరుపతి ప్రాంతంలో బీజేపీ కంటే కొద్దో గొప్పో జనసేనే బలంగా ఉంది.పవన్కు సామాజిక సమీకరణల పరంగా ఇక్కడ అభిమానులు ఎక్కువ.అయితే దేవాలయాలపై దాడులు, తిరుపతిలో డిక్లరేషన్ వివాదాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ జనసేనకు బీజేపీ కంటే మెరుగైన కేడర్ ఉంది.
అయినా ఈ ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని దింపకూడదని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికే పోటీకి రెడీ అవుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని జనసేనాని డిసైడ్ అయ్యారట.
బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టమని పవన్ ఇప్పటికే బీజేపీ నేతలకు సూచించారని తెలుస్తోంది.మొత్తం మీద రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తోన్న ఎన్నిక కావడంతో ఏ మేరకు సత్తా చాటుతాయి అనేది చూడాలి.