ఏఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీ గతం కంటే ఇప్పుడు ఎక్కువ చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేనను తీర్చిదిద్దాలంటే ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకోవాలని జనసేన భావిస్తోంది.
తమకు సంఖ్యాపరంగా ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు జనసేన సిద్దం అవుతోంది.దీనిలో భాగంగానే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని మించిపోయేలా పవన్ జనసేనను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ పరిణామాలు జనసేన లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుండగా తెలుగుదేశం పార్టీలో కలవరం పెంచుతున్నాయి.తమకు రావాల్సిన క్రెడిట్ అంతా జనసేన తన్నుకుపోతోంది అన్న బాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఎక్కువ కనిపిస్తోంది.
ముందు ముందు జనసేన ఇదే రకమైన స్పీడ్ తో ముందుకు వెళితే తరువాత తమకు ఇబ్బందులు తప్పవు అనే ఆలోచనతో టీడీపీ ఉంది.ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసీపీ వరుస సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకు వెళ్తున్నా ఇసుక కొరత ఆ పార్టీ ఇమేజ్ ను బాగా డామినేట్ చేసింది.
వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను జనాలు ఇసుక విషయమై నిలదీస్తూ ఉండడంతో సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వారు నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు.ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జనసేన ప్రజా ఉద్యమం చేసేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు నవంబర్ మూడవ తేదీన విశాఖలో ఇసుక విధానంపై భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.ఈ కార్యక్రమం విజయవంతం అయితే ఆ పార్టీపై ప్రజల్లో ఒకింత సానుకూల దృక్పథం ఏర్పడుతోంది.
ఇదే ఇప్పుడు టిడిపిని బాగా భయపెడుతోంది.ఇది ప్రధాన ప్రతిపక్షంగా గా తమకు రావాల్సిన మైలేజ్ జనసేన తన్నుకు పోతుంది అన్న బాధ టిడిపిలో ఎక్కువగా కనిపిస్తోంది.
అందుకే జనసేన మూడో తేదీన తలపెట్టిన కార్యక్రమాని కంటే ముందుగానే ఇసుక విధానంపై పోరాటం చేయవలసిందిగా టిడిపి నాయకులకు పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.ఇసుక విధానంపై ధర్నాలు, రాస్తారోకోలు ఆందోళనలు చేసి ఆ క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడేలా చేయాలని సూచనలు చేసింది.వీలైనంతగా ప్రజా సమస్యల విషయంలో జనసేన పార్టీ స్పందించే సమయం కంటే ముందుగానే మన పార్టీ నేతలు స్పందించి క్రెడిట్ పార్టీకి దక్కేలా చేయాలంటూ పలు సూచనలు చేస్తోంది.మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ స్థానాన్ని జనసేన ఎక్కడ ఆక్రమిస్తుందో అన్న ఆందోళన ఆ పార్టీ నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.