జనసేన పార్టీ బీజేపీలో విలీనం చేయబోతున్నారని, కాదు కాదు పొత్తు మాత్రమే పెట్టుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు వినిపించాయి.ఇటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల సాధక బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
పార్టీ నియోజకవర్గాల ఇంచార్జీలను నియమిస్తున్నాడు.తమ టార్గెట్ 2024 అన్నట్టుగా పవన్ పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నాడు.
అసలు ఈ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడానికి కారణాలేంటి ? ఎక్కడ తప్పు చేశాం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఈ క్రమంలోనే త్వరలోనే జిల్లాల పర్యటనలకు మళ్లీ వెళ్లేందుకు పవన్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఏదో విధంగా జనాంజనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తన బలం నిరూపించుకోవాలని కసి పవన్ లో బాగా కనిపిస్తోంది.అయితే జనసేన పార్టీ నేతలే ఇప్పుడు పవన్ మీద అనుమానంగా చూస్తున్నట్టు కనిపిస్తోంది.దీనికి కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.2009 ఎన్నికలకు ముందు పీఆర్పీ పార్టీని ఏర్పాటు చేసిన చిరంజీవి ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయారు.ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్రమంత్రి గా పదవి పొందారు.కానీ ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదే ఇప్పుడు జనసేన నాయకులను, ఆ పార్టీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేస్తోంది.
చిరంజీవి తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారనే ప్రచారం ఇప్పుడు పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.
దీంతో స్వయంగా పవన్ అబ్బే అటువంటిది ఏమీ లేదు తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.అంతే కాకుండా ఇప్పుడప్పుడే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా లేదని పవన్ కళ్యాణ్ తమ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులకు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు వేయడంలో ఇంకా తడబాటుకు గురవుతున్నారనే విషయాన్ని పార్టీ నాయకులు గుర్తించినట్టుగా కనిపిస్తోంది.అందుకే పదే పదే పవన్ వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు కొంతమంది రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.