ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసింది జనసేన.అధికార పార్టీ మీద విమర్శలు చేయడంలోనూ, ప్రజాసమస్యలను హైలెట్ చేస్తూ ప్రభుత్వంపై పోరాటం చేయడంలోనూ, సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేయడంలోనూ జనసేన పార్టీని బాగా యాక్టివ్ చేయగలిగారు పవన్.
గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో పవన్ పార్టీ మీద పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.ఈ ఎన్నికల్లో తనకు రెండుచోట్ల ఓటమి చెందడం తమ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కడంతో పవన్ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు.అలాగే ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పెద్దగా జనసేనకు ఓటింగ్ నమోదు అవ్వకపోవడం పవన్ ను బాగా కుంగదీసింది.అయితే ఆ కుంగుబాటు నుంచి తొందరగానే పవన్ తేరుకున్నాడు.
వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీ గా జనసేన ను తీర్చిదిద్ది ఎన్నికల బరిలోకి వెళ్లాలని పవన్ చూస్తున్నాడు.అయితే పవన్ ఈ విషయంలో ఒంటరిగా వెళ్లి ప్రభుత్వంపై పోరాడితే ఎవరికి ఎటువంటి అనుమానాలు సందేహాలు ఉండేవి కావు.
కానీ పవన్ మాత్రం రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తూనే తాను తెలుగుదేశం పార్టీకి అనుబంధ వ్యక్తిని అనేలా వ్యవహరిస్తూ జనసేనకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పవనే అడ్డుపడుతున్నాడు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పవన్ అధికార పార్టీ లోపాలని ఎట్టి చూపించేందుకు పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు.కానీ అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మీద టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు పవన్.తాను జగన్ లా ప్రతిపక్షంలో ఉండి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని, జగన్ ప్రతిపక్ష నాయకుడిగా విఫలమయ్యాడని పవన్ విమర్శలు చేసేవారు.
ప్రస్తుతం వైసిపి అధికారంలో ఉంది.టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.ఈ సమయంలో పవన్ మళ్ళీ జగన్ పార్టీనే టార్గెట్ చేసుకుంటూ టీడీపీకి మద్దతుదారుడు గా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.అలాగే విశాఖలో పవన్ చేపట్టిన ఇసుక లాంగ్ మార్చ్ కు టిడిపి మద్దతు తీసుకున్నాడు.
ఇక ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన దీక్షకు జనసేన తరఫున మద్దతు ప్రకటించాడు.
ఇది ఇలా ఉండగానే ఇటీవల టిడిపి నుంచి వైసీపీలోకి కృష్ణా జిల్లా నేతలు కొంతమంది వెళ్లారు.అలాగే మరి కొంతమంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో పవన్ అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లారు.చంద్రబాబుకు మద్దతు గా ఆయన మాటను బిజెపి అగ్ర నాయకుల చెవిన వేసేందుకే పవన్ ఢిల్లీ వెళ్లారనే విమర్శలు ఎదుర్కొన్నారు.
ఏ రకంగా చూసినా పవన్ టీడీపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శ అయితే పోగొట్టుకోలేకపోతున్నారు.ఇది రాజకీయంగా పవన్ కు ముందు ముందు ఇబ్బంది తెచ్చిపెట్టే విషయమే అయినా ఆ విషయాన్ని పవన్ గుర్తించలేకపోతున్నారు.
ఇక ఇవే విషయాల గురించి పవన్ పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట.కానీ పవన్ ఒక్క నాదెండ్ల మనోహర్ మాటలు తప్ప ఎవరు ఏమి చెప్పినా విని ఆచరించే పరిస్థితి లేకపోవడంతో తమకు ఎందుకులే అన్నట్టుగా వారు సైలెంట్ అయిపోతున్నట్టు తెలుస్తోంది.