సాధారణంగా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ లో నాయకులకు కాస్త వాక్ స్వాతంత్య్రం ఎక్కువ.ఏ విషయాన్నైనా కుండబద్దలకొట్టినట్టు మాట్లాడేస్తూ ఉంటారు.
అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రగిల్చిన యురేనియం చిచ్చు భగ భగ మండుతోంది.ఈవిషయంపై నాయకులు ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ సరికొత్త వివాదానికి తెరలేపారు.
ప్రస్తుతం తెలంగాణాలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ దాని నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడిప్పుడే మార్గాలను అన్వేషిస్తోంది.దీనిలో భాగంగానే తెలంగాణా పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగింది.
అక్టోబర్ లో సభ్యత్వ నమోదుకు నిర్ణయించారు.ఇదే సమయంలో యురేనియం తవ్వకాల విషయమై చర్చ మొదలయ్యింది.
ఒకరిని ఒకరు దూషించుకుంటూ విమర్శలకు తెరలేపారు.అసలు ఈ వివాదం ఏర్పడడానికి పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణం అయ్యాడు.
నల్లమలలో యురేనియం తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంత్ రావు హాజరయ్యారు.అయితే రాజకీయంగా ఏమాత్రం బలం లేని పవన్ కల్యాణ్ పిలిస్తే కాంగ్రెస్ నేతలు వెళ్లడం ఏంటి అంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ విషయంలో పార్టీ నేతలను తప్పుపట్టారు.అసలు ఈ యురేనియం అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అయితే, యురేనియం పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి అంటూ సంపత్ ప్రశ్నల వర్షం కురిపించారు.130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంతో ఆయన్ను హీరోను చేశారని విమర్శించారు.రాజకీయంగా తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం చూపించలేని పవన్ ముందు కూర్చొని కాంగ్రెస్ నేతలు చర్చలు ఏంటి అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పిలిచినప్పుడు పవన్ ఎప్పుడైనా వచ్చాడా రాలేదు కదా అటువంటప్పుడు సీనియర్ నాయకులంతా వెళ్లి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించారు.జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనన్న ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ మీటింగ్ లో రసాభాస చోటు చేసుకుంది.దాసోజు శ్రవణ్ నిరంజన్ మధ్య మాటల యుద్ధం జరిగింది.యురేనియం తవ్వకాల విషయమై ఇప్పటికే ఢిల్లీలో సంబంధిత అధికారులను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశామని, సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ లేఖ కూడా రాశారని చెప్పుకొచ్చారు.ఇక ఆ తరువాత దాసోజు శ్రావణ్, నిరంజన్ మధ్య వ్యక్తిగత దూషణలు పెరిగి రభస రభస అవ్వడంతో కుంతియా నేతలకు సర్దిచెప్పి వివాదానికి ముగింపు పలికారు.