ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పంచాయతీ ఎన్నికల చుట్టూ తిరుగుతూ ఉండగా తాజాగా స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి.స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విశాఖలో కార్మిక సంఘాలతో పాటు ఏపీలో కీలక పార్టీలకు చెందిన నాయకులు మండిపడుతున్నారు.
ఇప్పటికే ఈ విషయంలో ప్రతిపక్షాలు అధికార పార్టీ వైసీపీని దుమ్మెత్తి పోస్తూ ఉండగా మరోపక్క వైయస్ జగన్.కేంద్రానికి లెటర్ రాసి ఈ విషయంలో పునరాలోచించాలని పేర్కొన్నారు.
పరిస్థితి ఇలా ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ విషయం పై ప్రధానితో కలిసి మాట్లాడతానని తెలపడం జరిగింది.కాగా తాజాగా ఉన్నట్టుండి హైదరాబాద్ నుండి ఢిల్లీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో ఈ విషయం గురించి చర్చించడానికి పవన్ కళ్యాణ్ బయలుదేరడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ పర్యటనలో పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.పర్యటన లో జేపీ నడ్డా తో పాటు కేంద్ర పెద్దలను కూడా పవన్ కలిసే అవకాశం ఉందని, స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ వారితో సమావేశం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.