చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ఏడవమైలు గ్రామంలో హీరో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏడవమైలు గ్రామంలో నిన్న కొందరు అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.వారి మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరణించిన వారి కుటుంబాలను తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కుప్పం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం అనే ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతుంటే ప్రమాదం సంభవించింది.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.‘‘ఇది మాటకు అందని విషాదం.జనసైనికులను కోల్పోవడం ఎంత బాధగా ఉంది.కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రుల గర్భశోకాన్ని అర్థం చేసుకోగలను.
చనిపోయిన వారిని నేను తిరిగి తీసుకుని రాలేను.కానీ, ఆ కుటుంబాలకు బిడ్డగా తోడుంటాను.
వారి ఆత్మకు శాంతి చేకూరాలి.’’ అంటూ వాపోయారు.ఈ మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం చేశారు.గాయపడిన బాధితులకు తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని కుప్పం నియోజకవర్గం జనసేన నాయకులను ఆదేశించాడు.