ఏపీలో జనసేన, బీజేపీ ల మధ్య కొనసాగుతున్న పొత్తు వ్యవహారం రెండు పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారడంతో పాటు, ఈ విషయంలో ఈ విధంగా ముందుకు వెళ్లాలనేది అంతు పట్టని విషయంగా మారింది.ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల విషయంలో ఎవరు పోటీ చేయాలనే విషయంలో ఈ రెండు పార్టీలు ఒక క్లారిటీ కి రాలేకపోతున్నాయి.
ఇక్కడి నుంచి పోటీ చేయాలని బీజేపీ ఎంత బలమైన నిర్ణయం తీసుకుందో అంతకంటే ఎక్కువగా జనసేన ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ విషయంలో బీజేపీ తో తలపడేందుకు సిద్ధమవుతున్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఎన్నికలలో జనసేన పోటీ చేసేందుకు సిద్ధమైనా, బీజేపీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు.కానీ తిరుపతి విషయంలో ఆ విధంగా వెనక్కి తగ్గకూడదని అభిప్రాయపడుతున్నారు.
కొద్ది నెలల క్రితం తిరుపతి ఉప ఎన్నికలలో జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం తో జనసేన లో ఒక్క సారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మిత్రపక్షమైన తమను కనీసం సంప్రదించకుండా ఈ విధమైన ప్రకటన ఎలా చేస్తారంటూ జనసేన ఫైర్ అయింది.
అయితే ఇప్పుడు అదే తిరుపతి ఎన్నికలలో బీజేపీ జనసేన లలో ఎవరు పోటీ చేస్తారు అనే విషయం క్లారిటీ లేదు అని, ఎవరు అభ్యర్థి అనేది ఇంకా డిసైడ్ కాలేదు అని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.ఒకవైపు పవన్ తో సన్నిహితంగా వ్యవహరిస్తూ, మరోవైపు బిజెపి తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించే విషయం లో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
కానీ జనసేన తో ఎక్కడా వ్యవహారం చెడకుండా చూసుకుంటోంది.