ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో అధ్యక్షుడితో సహా మిగతా వారందరూ ఓడిపోయినా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఒక్కడు గెలవడంతో ఒకే ఒక్కడు గా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.దీంతో ఆయన జన సైనికులకు హీరోగా మారిపోయాడు.
మొదట్లో వైసీపీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా రాపాక పనిచేస్తూ ఉండేవారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉండేవారు.
దానికి కౌంటర్ వైసీపీ కూడా ఆయనను టార్గెట్ చేసుకుని ఓ కేసులో ఇరికించేందుకు కూడా ప్రయత్నాలు చేసింది.దీంతో పవన్ రంగంలోకి దిగి ఆయన్ను అరెస్ట్ చేస్తే తాను కూడా రాజోలులో ధర్నాకు దిగుతానని హెచ్చరించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
కానీ ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు గానీ రాపాక వరప్రసాద్ మాత్రం వైసీపీ కి దగ్గరగా చేరి పోయారు.జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని, అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అధికార పార్టీ నాయకుల కంటే ఎక్కువగా పొగుడు సొంత పార్టీకి ఇబ్బందికరంగా మారాడు.పవన్ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్న అంశాలనే రాపాక అదేపనిగా పొగుడుతూ పవన్ ఆగ్రహానికి గురి అవుతున్నాడు.దీనిపై ఆయనను ఎవరైనా ప్రశ్నించినా ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, దీనికి పార్టీకి సంబంధం లేదు అంటూ మాట్లాడుతున్నాడు.
దీనికి పవన్ సోదరుడు చిరంజీవి వ్యాఖ్యలను కూడా ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు.ఇంతగా జనసేన కు ఇబ్బందికరంగా మారినా పార్టీ అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటే అదీ కనిపించడం లేదు.రాపాక పై పవన్ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసినా అది జనసేన కు మైనస్ గా మారడమే కాకుండా, రేపాకకు వరంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అది కాకుండా దళిత ఎమ్మెల్యే అనే వివక్ష కారణంగా పవన్ ఈ విధంగా వ్యవహరించారని, అందుకే ఆయన పార్టీ మారారు అనే ప్రచారాన్ని జనసేన రాజకీయ ప్రత్యర్ధులు ప్రచారం చేసే అవకాశం ఉండడంతో పవన్ వెనుక తగ్గుతున్నట్టు గా తెలుస్తోంది.
అది కాకుండా ఇటీవల టిడిపి నుంచి సస్పెండ్ అయిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఇప్పుడు ప్రత్యేక ఎమ్యెల్యేగా గుర్తింపు పొందిన నేపథ్యంలో రాపాకను పవన్ సస్పెండ్ చేస్తే ఆయన కూడా అదేవిధంగా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు.ఈ విషయాన్ని పసిగట్టిన పవన్ తమ మీద, తమ పార్టీ మీద విమర్శలు చేస్తున్న రాపాక వరప్రసాద్ విషయంలో ఏమీ చేయలేక సైలెంట్ గా ఉండిపోతున్నట్టు అర్ధం అవుతోంది.