రాజకీయాల్లోకి కొత్తగా రాకపోయినా జనసేన పార్టీతో సరికొత్త రాజకీయాన్ని తెరమీదకు తెచ్చేందుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ఏపీలో చేదు అనుభవం ఎదురయినట్టు ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.అసలు కొన్ని సంస్థలయితే జనసేన ప్రస్తావనే లేకుండా ఫలితాల ప్రకటన చేశాయి.
సీఎం పీఠం మీద కూర్చోవడం ఖాయం అని జనసైనికులు హడావుడి చేస్తుంటే ఆ పార్టీకి నాలుగు లేక ఐదు సీట్లకు మించి సీన్ లేదని చెప్పేసాయి.ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేన పార్టీ వర్గాలు తమ పార్టీ కింగ్ మేకర్ స్థానంలో ఉంటుందని , పవన్ సీఎం అవ్వడం ఖాయం అని చెప్పారు.
ఇక లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ సర్వేలో జనసేన రెండు నుంచి మూడు సీట్లకు అటు ఇటుగా వస్తాయని తేల్చింది.
ఏపీలో జనసేనకు 11 శాతం ఓట్లు పడ్డాయని, ఆ పార్టీకి ఒక లోక్ సభ స్థానం మాత్రమే రాబోతోందని లగడపాటి సర్వే తేల్చింది.
ఇక జాతీయ సర్వేలు జనసేనను పార్టీ గురించి ప్రస్తావనే తీసుకురాలేదు.ఎంపీ సీట్ల అంచనాకే పరిమితమైన జాతీయ మీడియా సంస్థలన్నీ టీడీపీ, వైసీపీ సీట్లనే పరిగణలోకి తీసుకున్నాయి.
జనసేనకు ఒక్క స్థానం కూడా వస్తుందని ఎక్కడా చెప్పలేదు.దీంతో జనసేన కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.
మరోవైపు తమకు సైలెంట్ ఓటింగ్ పడిందని, మే 23 ఫలితాల తర్వాతే స్పందిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు అటు జాతీయ సర్వేల్లో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇండియా టుడే – మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనాలో వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని , టీడీపీకి కేవలం నాలుగు నుంచి ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది.అయితే జనసేనను పరిగణలోకి తీసుకోలేదు.అలాగే టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని తేల్చింది.
అలాగే న్యూస్ 18- ఐపీఎస్ఓఎస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 13-14 సీట్లు, టీడీపీకి 10-12 సీట్లు వస్తాయని అంచనా వేసింది.అయితే జాతీయ సర్వేల్లో జనసేన ప్రస్తావన లేకుండా ఉండడం ఆ పార్టీలో అయోమయానికి కారణం అవుతోంది.
రాజకీయ మార్పు తెస్తా అని హడావుడి చేసిన పవన్ కు మొదటి సారి ఎన్నికల్లో ఇలా చేదు ఫలితాలు ఎదురవ్వబోతుండడం పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి.ఈ నేపథ్యంలో పవన్ రాజకీయం ఇకపై ఎలా ఉండబోతోంది అనేది అందరికి ఆసక్తి కలిగిస్తోంది.