ఏపీలో మరోసారి మూడు రాజధానుల అంశం చర్చనీయాంశగా మారింది.రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులని గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
ఆమోదం తెలిపిన తర్వాత వైసీపీ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానులని ఎవరూ అడ్డుకోలేరని హడావిడి చేస్తున్నారు.
అమరావతిని కేవలం కార్యనిర్వాహక రాజధానికి పరిమితం చేయడం ద్వారా అమరావతి రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది.దీంతో గవర్నర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక తప్పిదం అన్నట్లు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
దీనిపై న్యాయస్థానంలో తేల్చుకుంటాం అంటూ చెబుతున్నారు.అయితే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్తా భిన్నంగా స్పందించారు.
మూడు రాజధానులకి మద్దతు ఇవ్వకుండా, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పకుండా రైతులకి న్యాయం జరగాలి అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
దీనిపై పవన్ కళ్యాణ్ ఒక లేఖ విడుదల చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్న తరుణంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో ఉన్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై కాకుండా, కరోనా నుంచి ప్రజలను రక్షించడం ఎలాగన్నదానిపై దృష్టి సారించాలని పవన్ హితవు పలికారు.
గుజరాత్ రాజధాని గాంధీనగర్ ను, చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ ను మూడున్నర వేల ఎకరాల్లోనే నిర్మించారు.ఏపీలో అమరావతిని కూడా అదే రీతిలో కట్టాలని నిపుణులు చెప్పినా, టీడీపీ ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా 33 వేల ఎకరాలు సమీకరించింది.
ఆ నిర్ణయాన్ని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా సమర్థించారు.అమరావతిలో అద్భుత రాజధాని నిర్మించాలంటే 33 వేల ఎకరాలు కావాల్సిందేనన్నారు.అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది జనసేన ఒక్కటే.ఆ భారీ రాజధానిని భవిష్యత్ ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లకపోతే భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏంటని నాడు ప్రశ్నించింది జనసేన మాత్రమే.
ఇప్పుడు రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడేందుకు జనసేన సిద్ధంగా ఉంది.నాడు టీడీపీ ప్రభుత్వం రాజధానిని మూడున్నర వేల ఎకరాలకు పరిమితం చేసి ఉంటే రైతుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అని పవన్ స్పష్టం చేశారు
.