ఏపీలో రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి.అధికార పార్టీ గా ఉన్న వైసీపీ సంక్షేమ పథకాల పేరు చెప్పి జనాల్లో బాగానే క్రేజ్ తెచ్చుకున్నా, పార్టీలో అసంతృప్తులు అధిష్టానానికి నిద్ర లేకుండా చేస్తున్నారు.
పార్టీపై జనాల్లో తీవ్ర ఆగ్రహం ఉందని, అది జగన్ కు చేరడం లేదని, జగన్ ఎవరిని కలుపు వెళ్లడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు.ఇది ఎలా ఉంటే, టిడిపి నుంచి వల్లభనేని వంశీ వంటి వారు కొంతమంది బయటకు వచ్చారు.
అధికారికంగా వైసీపీలో చేరకపోయినా, అనుబంధ సభ్యునిగా కొనసాగుతున్నారు.ఆయన ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.
అప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ తరఫున బరిలోకి దిగుదామని చూసినా, జగన్ వారించడంతో ఆగిపోయారు.కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగాలని చూస్తున్నారట.
ఈ మేరకు వైసీపీ కూడా ఉప ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో తమ పరిపాలన పై ప్రజల్లో ఏ మేరకు సానుకూలత ఉంది ? వ్యతిరేకత ఉంది అనే విషయం తెలుస్తుందనే అభిప్రాయం ఉంది.ఒకవేళ నిజంగానే వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఉప ఎన్నిక అవుతుంది.
కానీ ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడాలి అంటే అది అంత సులువైన పని కాదు.టిడిపికి మొదటి నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న గన్నవరంలో వైసిపి కి ఛాన్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు.
అంతేకకుండా, వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో గన్నవరం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన వెంకట్రావు కి వంశీ కి మధ్య ఇప్పటికీ సఖ్యత లేదు.ఒకవేళ వంశీని రంగంలోకి దింపినా, ఆయన ఏ మేరకు సహకరిస్తారు అనేది కూడా క్లారిటీ లేదు.
ఇది ఎలా ఉంటే, ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైతే టిడిపి నుంచి నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారని ప్రచారం కొద్దిరోజులుగా వినిపిస్తోంది.
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి లోకేష్ , భీమవరం గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి చెందారు .దీంతో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వారికి దక్కలేదు.ఈ నేపథ్యంలోనే వారు కూడా ఉప ఎన్నిక అనివార్యమైతే పోటీకి దిగాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఎలాగూ గన్నవరం టిడిపి కంచు కోట కాబట్టి, గెలుపు సులభమవుతుందని వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుని టిడిపి లోకేష్ ను రంగంలోకి దించాలని చూస్తుండగా, బీజేపీ మద్దతుతో తాను బరిలోకి దిగితే ఏ విధంగా కలిసి వస్తుందనే అంచనాలో పవన్ ఉన్నారట.ఎలాగు టిడిపి వైసిపి అభ్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో, అక్కడ ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ నిజంగానే ఇక్కడ ఉప ఎన్నికలు జరిగితే, ఈ ముగ్గురు పోటీలోకి దిగితే రసవత్తరమైన పోటీ ఉండే అవకాశం లేకపోలేదు.