టిడిపి జనసేన పార్టీ ల మధ్య ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేవి.టిడిపికి పవన్ బహిరంగంగానే మద్దతు పలకడం, పవన్ కు అంతే స్థాయిలో అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ, టిడిపి ఆయనకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు.
కానీ 2019 ఎన్నికలలో విడివిడిగా పోటీ చేయడంతో ఎవరికి వారే అన్నట్టుగా దూరం దూరం గా ఉంటున్నారు.ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీతో జనసేన పెట్టుకోవడంతో టిడిపి జనసేన మధ్య మరింత దూరం పెరిగింది.
ఈ రెండు పార్టీలు వేరు వేరు అంశాలపై వేరు వేరుగా ప్రజా పోరాటం చేస్తూ వస్తున్నాయి.ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తీరు చూస్తుంటే ఒకే బాటలో వెళుతున్నట్లుగా కనిపిస్తున్నారు.
ఏపీలో నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ నారా లోకేష్ సుమారు ఏడు జిల్లాల్లో పర్యటించారు.ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, హడావుడి చేశారు.
రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోరాటానికి దిగుతూ, హడావుడి చేస్తున్నారు.ముఖ్యంగా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతుల పొలాల వద్ద కు వెళ్లి స్వయంగా పరిశీలించి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి, రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ జగన్ ప్రభుత్వానికి సవాల్ చేశారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, ఆయన సైతం కృష్ణ, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో పర్యటించారు.తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలని హడావుడి చేశారు.
పంట నష్టపరిహారం కింద 30 వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని, తక్షణ సహాయం కింద పది వేలు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు.ఈనెల 28వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు జనసేన తరపున నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
కృష్ణాజిల్లాలో నిర్వహించబోయే ధర్నా కార్యక్రమానికి పవన్ స్వయంగా హాజరు కాబోతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ సైతం మరోసారి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
రైతు యాత్రల ద్వారా లోకేష్ కు, టీడీపీకి జనాల్లో ఆదరణ పెరిగింది అని, ఈ విషయంలో పోరాటం చేయడం వల్ల పార్టీకి క్రెడిట్ రావడంతో పాటు, ప్రభుత్వం నుంచి కూడా ప్రతి విమర్శలు పెద్దగా ఉండవనే అభిప్రాయంతో లోకేష్ ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే ఇటీవల కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడం తో పాటు, కలెక్టరేట్ల వద్ద లోకేష్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ విషయంలో జనసేన, టిడిపి లు ఒకే అంశంపై విడివిడిగా పోరాటానికి దిగుతుండడంతో ఇద్దరు వేరువేరుగా అయినా, ఒకే బాటలో ముందుకు వెళ్తున్నారు అనే అభిప్రాయం కలుగుతోంది.దీనిపై అప్పుడే వైసిపి నాయకులు సెటైర్లు వేస్తున్నారు.