పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వకీల్ సాబ్ను రూపొందిస్తున్నారు.
బాలీవుడ్ మూవీ పింక్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కాని విదేశీ షెడ్యూల్స్ లేవు కనుక కేవలం మూడు నెలల లోపే సినిమాను పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావించాడు.
కాని మొత్తం తారు మారు అయ్యింది.కరోనా వల్ల అంతటా కూడా మూతబడి పోయింది.
వకీల్ సాబ్ కూడా దాదాపుగా ఎనిమిది నెలల పాటు చిత్రీకరణ జరుపుకోకుండా అలా ఉండి పోయింది.ఎట్టకేలకు సినిమాను పునః ప్రారంభించారు.
దాంతో సినిమా సంక్రాంతికి వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.కాని పరిస్థితులు చూస్తుంటే వకీల్ సాబ్ సమ్మర్ వరకు అయినా వస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి వస్తుందని ఆశించిన ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివార్ తుఫాన్ బాధిత రైతులను పరామర్శించేందుకు ఏపీలో పలు జిల్లాల్లో పర్యటిస్తున్నాడు.
ఈ సందర్బంగా ఆయన వందల మంది రైతులను క్షేత్ర స్థాయిలో కలుస్తున్నాడు.రాజకీయంగా పవన్ తీరు బాగానే ఉంది.కాని హీరోగా మాత్రం ఆయన ఎందుకు ఇంతగా అభిమానులను చిరాకు పెడుతున్నాడు అంటున్నారు.వీలున్న సమయంలో చకచక ఎందుకు వకీల్ సాబ్ ను పూర్తి చేయలేదు.
డబ్బులు అవసరం వల్ల సినిమాలు చేస్తున్నట్లుగా చెబుతున్న పవన్ ఎందుకు అంత నిదానంగా సినిమాలను చేస్తున్నాడు అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి వకీల్ సాబ్ విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వక పోవడం వల్ల పవన్ అభిమానులు జట్టు పీక్కుంటున్నారు.