ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న జనసేన పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత అంతగా ప్రజలలో గుర్తింపు ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
దీనిని ఒక లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ కి పంపించారు.ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన లక్ష్మీనారాయణ భారీగానే ఓట్లు సొంతం చేసుకున్నారు.
అయితే ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటూ వస్తున్నా అతను అధినేత పవన్ కళ్యాణ్ మీద కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ మధ్య పలు మీడియా చానల్స్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి పార్టీలో నా అవసరం ఉన్నంత వరకు జనసేనలోనే ఉంటానని చెప్పారు.
అయితే ఊహించని విధంగా ఈ రోజు రాజీనామా చేసి షాక్ ఇచ్చారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి పంపించిన లేఖలో రాజీనామాకి గల కారణం తెలియజేశారు.
ప్రజా సేవ కోసం తాను నటనకు పూర్తిగా స్వస్తి చెబుతానని గతంలో అనేకసార్లు పవన్ కళ్యాణ్ చెప్పారని, కానీ ఆయన మళ్లీ నటించాలని నిర్ణయించుకోవడం సరికాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.దీన్ని బట్టి పవన్ కళ్యాణ్లో నిలకడైన విధివిధానాలు లేవని తెలుస్తోందని లేఖలో పేర్కొన్నారు.
ఈ కారణంగానే తాను జనసేన పార్టీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్టు లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.ఇంత కాలం తనకి సహకరించిన జనసేన సైనికులకి కృతజ్ఞతలు తెలియజేశారు.అయితే వివి లక్ష్మీనారాయణ రాజీనామా చేయడానికి పవన్ సినిమాలో నటించడమే కారణం కాదని తెలుస్తుంది.పార్టీలో తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు, బీజేపీ పార్టీతో పొత్తు సందర్భంగా కూడా తనని కనీసం సంప్రదించలేదనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడే స్థితిలో కూడా లేరని గ్రహించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేసి పార్టీ నుంచి బయటకి వేల్తునట్లు తెలియజేశారు.