ఇటీవల జనసేన కు రాజీనామా చేసి బయటకు వచ్చిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఇంకా ఆ పార్టీ మీద ఆగ్రహం చల్లారినట్టుగా కనిపించడంలేదు.రాజీనామా తరువాత సొంతంగా జేడీ పార్టీ పెట్టబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది.
ఇప్పటికే దానికి సంబంధించిన పేరును కూడా ఆయన ఫైనల్ చేసుకున్నారని, త్వరలోనే పార్టీ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జె.డి స్పందించారు.తాను రైతులకు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా చేయాలంటే అది రాజకీయ ద్వారానే సాధ్యమవుతుంది అని చెప్పారు.
జనసేన కు రాజీనామా చేసిన విషయంపైన లక్ష్మీనారాయణ స్పందించారు.
జనసేన తో నా రాజకీయ ప్రయాణం ఇక ముగిసిన అధ్యయనం అని వ్యాఖ్యానించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి ఏం చేయాలన్నదానిపై తాను తగిన నిర్ణయం తీసుకుంటానని లక్ష్మీనారాయణ చెప్పారు.
ఇక ముందు కూడా ప్రజా సేవ చేస్తూనే ఉంటానన్నారు.ఇప్పటివరకు తాను ఉన్న జనసేన పార్టీ ప్రజాసేవకు వేదిక కాదు అన్నట్టుగా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.
విజయవాడలోని ఓ సమావేశానికి హాజరయిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ విధానాలను పొగడడం తోపాటు కేంద్ర బడ్జెట్ బాగుంది అంటూ మాట్లాడటంతో ఆయన త్వరలోనే బిజెపిలోకి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది.కానీ ఆయన ఆ విషయాలు వేటిపైనా స్పందించలేదు.ముందుగా ప్రజల్లో తిరిగి పూర్తిస్థాయిలో ప్రజల నాడి తెలుసుకుని, ఆ తర్వాత మాత్రమే సొంతంగా పార్టీ పెట్టాలా లేక వేరే ఏదైనా పార్టీలో అనే విషయంపై ఆయన తగిన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తున్నారు.