క్లారిటీ గా రాజకీయాలు చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా తడబాటు కి గురవుతున్నట్టు కనిపిస్తున్నారు.ఇప్పటికే జనసేన రాజకీయ భవిష్యత్తుపై అందరిలోనూ నీలి నీడలు కమ్ముకున్నాయి.
ఈ దశలో జనసేన అనుమానాస్పదంగా రాజకీయాలు చేస్తోంది అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ముఖ్యంగా టీడీపీ విషయంలో పవన్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ నాయకుల్లోనే తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
ఒక వైపు సినిమాలు,, మరో వైపు పార్టీ ఇలా రెండు పడవలపైనా పవన్ క్లారిటీ లేకుండా ముందుకు వెళ్తున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో అనుబంధం విషయంలో పవన్ వైఖరి ఎప్పటి నుంచో చర్చనీయాంశం అవుతోంది.
తాజాగా టిడిపి మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారంలో జనసేన పార్టీ అనుసరించిన వైఖరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన వెంటనే జనసేన పార్టీ కి చెందిన ఓ కీలక నాయుడు ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్ కార్యక్రమానికి హాజరైన జనసేన నాయకుడు అచ్చెన్న అవినీతికి పాల్పడ్డారని, ఆయనను అరెస్టు చేసి మంచి పని చేశారు అంటూ కామెంట్స్ చేసారు.అక్కడితో ఆగకుండా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా అంటూ ఆయన చెప్పడం తో టిడిపి యాంటీ స్టాండ్ జనసేన ఇంత అకస్మాత్తుగా ఎందుకు తీసుకుంది అనే అనుమానాలు అందరిలోనూ మొదలైంది.
సోషల్ మీడియాలోనూ జనసేన పార్టీ నాయకులు టీడీపీని ఉద్దేశించి మరింతగా కామెంట్లు చేయడం వంటి పరిణామాలు కలకలం రేపాయి.ఈ వ్యవహారంపై అప్రమత్తమైన టిడిపి నష్ట నివారణ చర్యలు దిగినట్టు తెలుస్తోంది.ఈ మేరకు టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి జనసేన వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.ప్రస్తుతం వరుస వరుసగా టిడిపి నాయకులను వైసీపీ టార్గెట్ చేస్తుంది, వేధింపులకు పాల్పడలని చూస్తోందని, ఈ సమయంలో మీ పార్టీ తరఫున సానుభూతి చూపించకపోగా, విమర్శలు చేయడం తగదని, దీని కారణంగా అధికార పార్టీకి మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జనసేన తరుపున పార్టీ నాయకులు ఎవరు టిడిపి విషయంలో వ్యతిరేకంగా మాట్లాడవద్దు అంటూ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.దీంతో ఉదయం వరకు టిడిపి పైన , అచ్చెన్న అరెస్టు పైన విమర్శలు చేస్తూ వచ్చిన జనసేన నాయకులు అకస్మాత్తుగా అరెస్ట్ అక్రమం అంటూ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు.
అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ వేధింపులు ఆపాలంటూ డిమాండ్ కూడా మొదలుపెట్టారు .ఒక్కసారిగా జనసేన ఈ విధంగా యూటర్న్ తీసుకోవడంపై జనసేన పార్టీలో ఉన్న గందరగోళాన్ని తెలియజేస్తుంది అనే విమర్శలు లేకపోలేదు.