ఒకసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు అంటే, కష్టమైన, నష్టమైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నిత్యం జనాల్లో ఉండాల్సిందే. రాజకీయ పార్టీ స్థాపించిన వారైతే, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, ప్రజల్లో బలం పెంచుకుంటూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూ ముందుకు వెళ్లాలి.
అలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాలు అన్నట్టుగా వ్యవహరిస్తే, ఎప్పటికీ అధికార పీఠం అనేది దక్కదు.ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.
జనసేన పార్టీ స్థాపించి అప్పుడే ఏడు సంవత్సరాలు అయింది.క్షేత్రస్థాయిలో ఎంత వరకు బలోపేతం చేశామన్నది ఆయనకు తెలుసు.
ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా, సార్వత్రిక ఎన్నికలు జరిగినా, జనసేన పరిస్థితి ఏంటనేది పవన్ కు బాగా తెలుసు.పవన్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.
బలమైన సామాజిక వర్గం అండదండలు ఉన్నాయి.అయినా వాటిని అనుకూలంగా మార్చుకోవడం లో పవన్ సక్సెస్ కాలేక పోతున్నారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన ఇబ్బందులు అన్ని పవన్ కు బాగా తెలుసు.రాజకీయం అంటే ఏమిటో అప్పుడే పవన్ చూశారు.అయినా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విషయంలో మాత్రం పవన్ సక్సెస్ కాలేక పోయారనే చెప్పాలి.మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు దారులుగా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిగా పవన్ ముద్ర వేయించుకున్నారు.2014 ఎన్నికల్లో బిజెపి టిడిపి కూటమికి మద్దతు పలకడమే కాకుండా, ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇక టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నా, ఆ పార్టీకి మద్దతుగా నిలబడ్డారు.
అప్పట్లో వైసిపి ప్రతిపక్షంలో ఉన్నా, ఆ పార్టీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసేవారు.ఇక ఇప్పుడూ కొనసాగిస్తున్నారు.2019 ఎన్నికల్లో ఓటమి నుంచి పవన్ తొందరగానే బయట పడ్డారు.కానీ పార్టీ ని మాత్రం ఆ ఓటమి ప్రభావం నుంచి బయటపడేసే విషయంలో పవన్ ముందడుగు వేయడం లేదు.
బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నా, అసలు పొత్తు ఉందో లేదో అన్నట్టుగా పరిస్థితి ఉంది.జనసేన ను బిజెపి పట్టించుకోనట్టు గానే వ్యవహరిస్తోంది.అయినా పవన్ బిజెపి మద్దతు తమకు ఉందని, ఆ పార్టీతో ఏపీలో చక్రం తిప్పుతాము అన్నట్టు గానే వ్యవహరిస్తున్నారు.
ఇక ఏపీ రాజధాని అమరావతి విషయంలో, రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, తాము జోక్యం చేసుకోమని, స్పష్టంగా చెప్పేసినా, పవన్ మాత్రం బీజేపీ అండ తో అమరావతి ని అడ్డుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారు.ఈ విషయాన్ని చూస్తూనే రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన ఏంటో అర్థం అవుతోంది.ఇక పవన్ ట్విట్టర్ ద్వారా మాత్రమే రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పవన్ వ్యవహార శైలిపై జనసైనికులు కూడా ఆగ్రహం గానే ఉన్నారు.మొదటి నుంచి ఇదే వైఖరితో మనం దెబ్బతిన్నా మని ఇప్పటికీ ఆ వైఖరి మార్చుకోకుండా వ్యవహరిస్తే మళ్లీ దెబ్బతినడం ఖాయం అని, పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.