తమ నాయకుడిని ఎప్పటికైనా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి అనేది జనసైనికుల ఆకాంక్షగా ఉంటూ వస్తోంది.ఈ మేరకు వారు పార్టీని తమ భుజస్కంధాలపై మోస్తూ, అధినేత కంటే ఎక్కువగానే కష్టపడుతున్నారు.
ఈ సందర్భంగా మిగతా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలతో వివాదాలకు సైతం దిగుతున్నారు.అలాగే ఎక్కడ ఏ విపత్తులు సంభవించినా, ప్రజా సేవలో ఉంటూ, పార్టీ ఉనికిని కాపాడుతూ వస్తున్నారు.అయితే ఓ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినా, జనసైనికుల మాత్రం ససేమిరా అంటూ ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.2024 ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పార్టీగా అవతరించాలి అనేది పవన్ తో పాటు జనసైనికుల ఆకాంక్ష.ఆ మేరకు తమ శక్తి సామర్ధ్యాలు మరింత గా పెంచుకోవాలి అనే భావంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అయితే మొదటి నుంచి ఈ పొత్తు ఉ వ్యతిరేకిస్తూ వస్తున్న జనసైనికులు క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పని చేసేందుకు ఇష్టపడడం లేదు.
ఈ విషయం ఇప్పుడిప్పుడే బయటికి వస్తుండటంతో ఆ పార్టీలో ఏం జరుగుతోంది అనే సందేహం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేసే విషయంలో పవన్ జిల్లాల వారీగా జనసైనికులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.కరోనా సహాయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోవాలని, ఈ సందర్భంగా సూచిస్తున్నారు.అయితే జనసైనికులు మాత్రం బీజేపీ శ్రేణులను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని పవన్ సూచిస్తున్నా, జనసైనికులు మాత్రం ఆ విషయంలో అధినేత మాటలు సైతం ధిక్కరిస్తూ తమ మనసులోని ఉద్దేశాన్ని బహిరంగంగా పవన్ కళ్యాణ్ ముందే చెప్పేస్తున్నారట.
బిజెపికి నాయకుల కొరత లేకపోయినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం చాలా తక్కువ.ఈ లెక్కన చూసుకుంటే, బీజేపీ కంటే జనసేన బలంగా ఉంది అనేది జనసైనికుల వాదన.
కాబట్టి క్షేత్రస్థాయిలో తాము కష్టపడినా, ఆ క్రెడిట్ మొత్తం బీజేపీ తమ ఖాతాలో వేసుకుంటుంది అని, దీని కారణంగా జనసేన కు రావాల్సిన మైలేజ్ బీజేపీ కి వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడు జనసైనికులు మాట.అంటే పై స్థాయిలో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నా, క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.అసలు బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా చాలామంది జనసైనికులు గుర్తించడం లేదు.