వైసీపీ జనసేన పార్టీ మధ్య వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అధికార పార్టీ వైసిపిని అడుగడుగున ఇబ్బంది పెట్టే విధంగా పవన్ ప్రయత్నిస్తూ ఉంటారు.
ఈ విషయంలో టిడిపి, బిజెపి వామపక్షాలు ఇలా అందరితోనూ కలిసి ప్రభుత్వంపై పోరాడేందుకు పవన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.ఇప్పుడే కాదు వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పవన్ వ్యవహారశైలి వైసిపి విషయంలో ఇలాగే ఉంటూ వస్తోంది.
ఇక జగన్ కూడా జనసేన విషయంలో ఇదే రకంగా ఉంటున్నారు.జనసేనను , ఆ పార్టీ చేసే విమర్శలను ఆయన పెద్దగా పట్టించుకోనట్లు కనిపించినా, ఏదైనా అవకాశం వస్తే జనసేన ని ఇరుకున పెట్టే విధంగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో కొద్దిరోజుల పాటు ప్రభుత్వం పై పోరాటాలు అంటూ హడావుడి చేసిన పవన్ పూర్తిగా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.సినిమాల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.దానిలో భాగంగానే కరోనా ప్రభావం కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ పవన్ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు.ట్విట్టర్ వేదికగా పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనేక పోస్టింగ్ లు కూడా పెట్టారు.
అయినా ఈ విషయంలో ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో స్వయంగా పవన్ ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి పరీక్షలు రద్దు చేయాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించి పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు గా ప్రకటించారని, ఇది జనసేన విజయమని అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అంతేకాదు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించిన తర్వాత పవన్ జగన్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పినట్లుగా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఇవే కాకుండా అనేక అంశాలపైన జగన్ తో పవన్ ఫోన్ ద్వారా మాట్లాడినట్లు, దానికి జగన్ సానుకూలంగా స్పందించినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ విషయాన్ని అధికారికంగా రెండు పార్టీలు ధృవీకరించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.