గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమిపాలైనప్పటికీ ధైర్యాన్ని కోల్పోక ఎంతో నిర్భయంగా మరో 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడుపుతాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఆయన ప్రకటించినట్లుగానే తన సినిమా కెరీర్ ని సైతం వదులుకొని పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్.ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు,కార్యకర్తల తో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది తనపై అనవసరంగా బురద జల్లుతున్నారని, పొత్తులు కావాలనుకుంటే ఎవరితో అయినా కలవగలను అంటూ స్పష్టం చేశారు.అంతేకాకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న ఆరోపణల పై సైతం పవన్ మరోసారి స్పష్టం చేశారు.
అసలు అలాంటి ఒప్పందం ఏమి కుదుర్చుకోలేదంటూ ఆ ఆరోపణలు కొట్టిపారేసిన ఆయన టీడీపీతో కలిసి పోటీ చేయాలనుకుంటే అసలు నన్ను అపేదెవరంటూ ప్రశ్నించారు. ఒక ఆశయానికి కట్టుబడి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశామని,అది నమ్మకపోతే అది వాళ్ల సమస్య తప్ప తనది కాదంటూ వ్యాఖ్యానించారు.
అలానే ఏపీ లో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉందని,దీనివల్ల తమ పార్టీ ఆఫీస్ నిర్మాణం సైతం నిలిచిపోయింది అంటూ పవన్ అన్నారు.సీఎం జగన్ చాలా విషయాలపై నిర్భయంగా మాట్లాడగలిగినప్పుడు .మాటమీద నిలబడే తాను దానికి పదింతలు ధైర్యంగా మాట్లాడగలనన్నారు.
అలానే నా తోలి సినిమా ప్లాప్ అయినప్పుడు కూడా చాలా మంది ఎంతో హేళన చేశారని గుర్తు చేసుకున్న ఆయన ఒదిన చోటే గెలుపు సాధించడం తనకు అలవాటు అంటూ తెలిపారు.లక్షలాది మందితో చప్పట్లు కొట్టించుకునే స్థితిలో ఉండి కూడా నెలల తరబడి టీవీల్లో ఎవడు పడితే వాడు తిడుతుంటే భరించడం తనకు సరదా కాదని తెలిపారు.అలానే ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని ఆతరువాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని పవన్ తెలిపారు.