పవన్ కళ్యాణ్ కి ఏపీ రాజకీయాలు బాగానే వంటపట్టాయి.సహజంగా రాజకీయ నేతలు ఎన్నికల ముందు చెప్పేదొకటి ఎన్నికల తరువాత చేసేదొకటి అని ఫిక్స్ అయ్యిపోయారు ప్రజలు అయితే రాజకీయాల్లో మార్పు తీసుకు వస్తాను ఇచ్చిన మాట మీద నిలపడతాను, సరికొత్త రాజకీయాలను తెలుగు ప్రజలకు పరిచయం చేస్తాను, యువతను రాజకీయాల్లోకి తీసుకు వస్తాను, వారికి అధికారం దక్కాలి అలా అయితేనే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది అంటూ ఊకదంపుడు ప్రసంగాలు, భారీ డైలాగులు కొట్టారు జనసేనాని.
అంతేనా ఒకడుగు ముందుకు వేసి విశాఖ ఎంపీ ఎమ్మెల్యేలు వలసవాదులు అంటూ పవన్ గొంతెత్తి మరి నినదించారు.
స్థానిక నాయకత్వానికి పట్టం కడతాం అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అసలు విషయానికి వచ్చేసరికి తాను ఎంపిక చేసిన జాబితాలో అనేకమంది నాన్ లోకల్ లీడర్లు కనిపించటంతో స్థానిక జనసేన నేతలకు కార్యకర్తలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
నాన్ లోకల్ లీడర్స్ అంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న మాజీ పోలీసు అధికారి జె.డి లక్ష్మీనారాయణ దిగుమతి కాదా, ఆయన పుట్టింది కడప, పెరిగింది కర్నూలు, మరి జేడీని విశాఖకు ఎందుకు ఎంపిక చేసినట్టు.
ఇక అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని తీసుకుంటే ఈయన పక్కా లోకల్ ఈ స్థానాన్ని పార్థసారథికి ఇచ్చారు ఆయన సైతం గుంటూరు జిల్లాకు చెందిన వారు కావటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇదిలా ఉంటే భీమునిపట్నం ఎమ్మెల్యే పంచకర్ల సందీప్ విజయవాడ వ్యక్తి కావడం మరొక విశేషం.ఇక పాయకారావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తూ.గో జిల్లా కి చెందిన నక్క రాజబాబుకు ఇచ్చారు.అదేవిధంగా ఉత్తరం సీటు ని కూడా ఇతర జిల్లాలకు చెందిన పసుపులేటి ఉషాకిరణ్ ఇచ్చారు.అన్నిటినీ మించి గాజువాక సీటును లోకల్ అభ్యర్థులకు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడం గతంలో తాను మాట్లాడిన లోకల్, నాన్ లోకల్ అనే మాటలకు ఎలాంటి అర్థం ఇస్తుందో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.
పవన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై పార్టీలోనూ బయట కూడా విమర్శలు వస్తున్నాయి.పవన్ చెప్తున్నది ఒకటి చేస్తున్నది మరొకటి అంటూ సొంత పార్టీ నేతలే విస్మయానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది.
తానూ గాజువాక నుంచి పోటీ చేయడం కోసం స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య కు పెందుర్తి సీటు ఇచ్చి అక్కడ నాన్ లోకల్ అభ్యర్ధిగా నిలబెట్టారు.రాజకీయాల్లో నూతన వరవడిని తీసుకువస్తా అది చేస్తా ఇది చేస్తా అంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ అందరిలానే వలస పక్షులకి ఆశ్రయం ఇచ్చాడు మరి పవన్ తీసుకొచ్చే మార్పు ఇంకేంటి అంటూ కడిగేస్తున్నారు ఏపీ ప్రజలు.
పవన్ సరికొత్త రాజకీయాలు చేస్తాడని అనుకుంటే పాత చింతకాయకి కొత్త తొడుగు తొడిగినట్టు ఉందని విశ్లేషకులు సైతం విమర్శలు చేస్తున్నారు.
.