పవర్స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించబోతున్నారని సమాచారం.ఆయన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ త్వరలోనే ముగుస్తుందట.
ఆ వెంటనే ఆయన ఏపీలో పర్యటిస్తారని తెలుస్తోంది.పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా పవన్ పర్యటన ఏర్పాటు చేసుకున్నారు.
ఈ పర్యటన ద్వారా పార్టీ కార్యకలాపాలకు నాంది పలకబోతున్నారని, అభిమానులను, కార్యకర్తలను పార్టీ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తారని అంటున్నారు.అక్టోబరు రెండో తేదీన గాంధీ జయంతి కాబట్టి దాన్ని ముహూర్తంగా ఎంపిక చేసుకున్నారు.
శ్రీకాకుళం నుంచి పర్యటన ప్రారంభమవుతుంది.పవన్ రైతులను కలుసుకొని మాట్లాడతారు.
వారి అభిప్రాయాలు, వినతులు స్వీకరిస్తారు.సంక్షేమ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయో తెలుసుకుంటారు.
రాజధాని నిర్మాణ సమస్యలను, అక్కడి రైతుల ఇబ్బందులను తెలుసుకుంటారు.పవన్ కొంతకాలం కిందట ఏపీలోని రాజధాని నిర్మాణ ప్రాంతంలో పర్యటించి సభ కూడా నిర్వహించారు.
భూసేకరణ విషయంలో రైతుల పక్షాన పోరాడుతానని అన్నారు.రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకోవద్దని, వారు అంగీకరిస్తేనే తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్పారు.
బలవంతంగా భూసేకరణ చేస్తే తాను ధర్నా, నిరాహార దీక్ష చేస్తానని కూడా సర్కారును హెచ్చరించారు.పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినా అతను తమ వాడేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
పవన్ వైఎస్ జగన్కు చెక్ పెట్టేందుకు వస్తున్నారని అంటున్నారు.వైఎస్ జగన్ ఈమధ్య కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిపోతున్నారు.
వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
ఈ స్థితిలో పవన్ పర్యటిస్తే జగన్ వేగం తగ్గుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారట.నిజంగా పవన్ టీడీపీకే మద్దతు ఇచ్చేట్లయితే రాష్ర్టమతా పర్యటించడం ఎందుకు? పవన్ తన పర్యటనలో ఎలా వ్యవహరిస్తారో దాన్ని బట్టి ఆయన వైఖరి అంచనా వేయొచ్చు.