రాజకీయాలంటే ఆషామాషీ వ్యవహారం ఏమి కాదు.నాయకుడిగా మనం ఒక ప్రకటన చేసామంటే తప్పకుండా దానికి కట్టుబడి ఉండాలి.
లేకపోతే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతాము.అందుకే రాజకీయాలు సీరియస్ గానే తీసుకుని ముందుకు వెళ్లాలి.
లేకపోతే వెనకబడి పోతాం అనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా గుర్తించినట్లుగా కనిపించడం లేదు.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా దెబ్బతిన్నా పవన్ లో ఆ బాధ, పశ్చాత్తాపం ఎక్కడా కనిపించడం లేదు సరి కదా మరింత ఉత్సాహంగా రాజకీయాల్లో యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
ప్రభుత్వానికి డెడ్లైన్లు విధిస్తూ దీక్షలు ,ధర్నాలు అంటూ హడావుడి చేస్తున్నారు.అయితే ఇవన్నీ పార్టీకి ఏమైనా కలిసి వస్తున్నాయా అనే చర్చ జనాల్లో నలుగుతోంది.
పవన్ కు రాజకీయాలు కొత్త ఏమీ కాదు.గతంలోనూ ఇదేవిధంగా అనేక ధర్నాలకు, పోరాటాలకు దిగుతానని పవన్ అనేక హెచ్చరికలు చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ 2019 ఎన్నికలకు ముందు పవన్ బహిరంగంగా ప్రకటించారు.కానీ ఆ తరువాత ఆ ఊసే మర్చిపోయారు.
ఇక శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను కూడా పవన్ తన బుజాల మీద వేసుకున్నాడు.కిడ్నీ బాధితులకు సరైన న్యాయం జరగకపోతే తానూ ఆందోళనకు దిగుతాను అంటూ పవన్ గట్టిగానే హెచ్చరికలు చేశారు.
ఈ మేరకు ప్రభుత్వానికి గడువుని కూడా విధించారు.దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ బాధితులకు కొంతమేర సహాయం అందించింది.
ఇటీవల మదనపల్లెలో టమాటా రైతు మార్కెట్ లో రైతులను చూసి పవన్ ఆవేదన చెందారు.అసెంబ్లీ సమావేశాల్లో టమాటా రైతుల సమస్యలను పరిష్కరించకపోతే అమరావతిలో తాను బహిరంగ సభ పెడతాను అంటూ హెచ్చరించారు.ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పవన్ దీక్షకు దిగారు.రైతు సమస్యలు పరిష్కరించకపోతే తాను నిరసన దీక్షకు దిగుతానని ముందుగానే ప్రకటించారు.అయితే పవన్ చేస్తున్న ఈ ఉద్యమాలు ధర్నాలు వెనక చిత్తశుద్ధి ఎంత ఉందన్నది ప్రశ్నగా మారింది.ప్రతి విషయానికి ధర్మాలు, పోరాటాలు అంటూ హడావుడి చేయడం కంటే అసలు తాము డిమాండ్ చేస్తున్న అంశం సాధ్యం అవుతుందా కాదా, ప్రజల అభిప్రాయం ఏంటి అనేది పవన్ పట్టించుకోవడం లేదు.
ఆ విధంగానే ఇసుక దీక్ష, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై అకస్మాత్తుగా పవన్ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది.