ఈనెల 12వ తేదీలోగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే కాకినాడ కేంద్రంగా చేసుకుని రైతులకు మద్దతుగా తాను ధర్నాకు దిగుతానని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న నేపథ్యంలో పవన్ ఈ ధర్నా కార్యక్రమం మొదలు పెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
పవన్ ఇంత అకస్మాత్తుగా కాకినాడ కేంద్రంగా ఉద్యమించేందుకు సిద్దమవుతుండడం వెనుక రాజకీయ కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.ముఖ్యంగా కాకినాడను ఎంచుకోవడానికి ప్రధాన కారణం కాకినాడ రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికై, ఆ తర్వాత వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కురసాల కన్నబాబు, అలాగే కాకినాడ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగన్ కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
అదీ కాకుండా ద్వారంపూడి అసోసియేషన్ నాయకుడిగా కూడా ఉండడం కురసాల కన్నబాబు తో వ్యక్తిగత వైరం ఉండడం ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో పవన్ అన్నయ్య చిరంజీవి కి కన్నబాబు చాలా సన్నిహితంగా మెలిగేవారు.తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రజారాజ్యం పార్టీ పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది.ఆ సమయంలో తిరుగుతూ సన్నిహితంగా మెలిగిన కన్నబాబు, వంగా గీత వంటి వారు తాను జనసేన స్థాపించిన తరువాత తన పార్టీలో చేరకుండా ఇతర పార్టీలో చేరడం పవన్ కు రుచించలేదు.
అందుకే ఎన్నికల ముందు కూడా కన్నబాబు ను టార్గెట్ చేసుకుంటూ పవన్ గట్టిగానే విమర్శలు చేశారు.
కేవలం కాకినాడ పర్యటన లోనే కాకుండా ఏపీలో అనేక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ సందర్భం దొరికినప్పుడల్లా ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చి విమర్శలు చేస్తూ తనకు ఆయనపై ఎంత కోపం ఎంత ఉందో చెప్పకనే చెప్పారు.ప్రస్తుతం రైతుల కోసం పవన్ దీక్ష చేయడానికి ప్రధాన కారణం వ్యవసాయ మంత్రిగా కన్నబాబు పూర్తిగా విఫలమయ్యారని నిరూపించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది.గత టిడిపి పరిపాలనలో ఐదేళ్లపాటు ఏపీలో ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడినా పవన్ స్పందించలేదు.
కానీ ప్రస్తుతం ఇసుక, రైతు సమస్యలు అంటూ పవన్ క్షేత్రస్థాయిలో పర్యటించి పోరాటం చేయడం వెనుక వైసీపీ ప్రభుత్వం పై ఉన్న ఆగ్రహం, కన్నబాబు పై ఉన్న రాజకీయ కక్ష ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.