జనసేనాని ఇప్పుడు నిజంగా తన పవరేంటో చూపించాడు.ప్రశ్నిస్తాను.
ప్రశ్నించడానికే వచ్చా! అంటూ 2014లో జనసేన పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.తాజాగా శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతంలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కిడ్నీ బాధితుల పక్షాల నిలబడి నిజంగానే ప్రశ్నించాడు.
సుత్తిలేకుండా సూటిగా చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.గతంలో తిరుపతి, కాకినాడ, అనంతపురం సభల్లో పవన్ ప్రసంగించినా.
ఏదో క్లారిటీ మిస్సయిందని అందరూ అనుకున్నారు.కానీ, తాజాగా ఉద్దానంలో పవన్ చేసిన ప్రసంగం.
వదిలిన మాటల తూటాలు పూర్తి క్లారిటీని ఇచ్చాయనడంలో అనుమానం లేదు.
కొన్ని దశాబ్దాలుగా కిడ్నీల సమస్యతో శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతంలో ఉన్న నాలుగు మండలాల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.
వీరి సమస్యలను ఇటీవల ఓ చానెల్ వెలుగులోకి తీసుకువచ్చి.వరుస కథనాలు ప్రసారం చేసింది.
ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని సదరు చానెల్ వివరించింది.దీనిపై సమాచారం అందుకున్న పవన్ హుటాహుటిన ఉద్దానం యాత్రకు సిద్ధమయ్యాడు.
అనుకున్నదే తడవుగా బాధితులను పరామర్శించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమనే అజెండాను అత్యంత పకడ్బందీగా చేసేశాడు.హడావుడీ లేదు, ఆరోపణాలేదు.
ఉన్నదంతా వాస్తవమే! అన్నట్టుగా సాగిన పవన్ ఉద్దానం యాత్ర అందరినీ ఆలోచింపజేసింది.
పుష్కరాల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి(గత ఏడాది ఆగస్టులో జరిగిన కృష్ణా పుష్కరాలకి ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు పెట్టింది), ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే ఆదుకోవడానికి డబ్బులు లేవా అని పవన్ అడిగిన ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగానే తగిలింది.
రాష్ట్ర ఆరోగ్య బడ్జెట్ 6 వేల కోట్లు, దానిలో 100 కోట్లు ఈ ప్రాంతం కోసం ఖర్చు పెట్టలేరా అని పవన్ లేవనెత్తిన వాదన లో లాజిక్ ఆకట్టుకుంది.
రాష్ట్రవిభజన సమయంలో ఉత్తరాంధ్ర వెనుకబాటు,పేదరికం గురించి ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడలేదు అని పవన్ ఇక్కడ నాయకుల అసమర్థతని కూడా నిలదీశాడు.
మొత్తానికి 45 నిమిషాల సమావేశం లో పవన్ మాట్లాడింది 20 నిమిషాల లోపే, అయినా చంద్రబాబు సర్కారుకి దిమ్మతిరిగేలా ఉందనే కామెంట్లు వినబడుతున్నాయి.