జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎవరికీ అర్ధం కావడం లేదు.ఆయన పార్టీకి ఏపీలో ఎంతో కొంత ప్రాధాన్యం ఉంది.
2019 ఎన్నికల్లో ఆ పార్టీ కొంత ఓట్ షేర్ కూడా సొంతం చేసుకుంది.అయితే ఇటీవల తన పార్టీ తెలంగాణలోనూ పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
పవన్ రెండు పడవల మీద కాళ్లు వేయడం ఆ పార్టీకే నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడుతున్నారు.కానీ తెలంగాణలోనూ తన ఉనికి చాటుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసి పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా పోటీ చేయాలన్న ఆశ పుట్టింది.తెలంగాణాలోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది.
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు షాక్ ఇచ్చేలా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా కొన్ని ప్రశ్నలను సంధించడం ఆ పార్టీని ఇరుకున పెడుతోంది.
తెలంగాణ సమయంలో తాము అధికారంలోకి వస్తే దళితులకు సీఎం పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
అయితే రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కేసీఆర్ ఆ హామీని గాలికొదిలేశారు.దీంతో ఈ విషయంపైనే జనసేన తాజాగా ఫోకస్ చేసింది.
తెలంగాణలో దళితులకు ఇస్తామన్న ముఖ్యమంత్రి కుర్చీ ఏదీ అంటూ టీఆర్ఎస్ పెద్దలకు బాణం తగిలేలా తెలంగాణ జనసేన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
తెలంగాణలో దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని.దళితులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఎన్నికల సమయంలో రూ.10 లక్షలు ఇస్తామని చెప్పి ఆశ పుట్టించారని.తీరా ఆ హామీని కూడా పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ పార్టీని జనసేన సూటిగా ప్రశ్నించింది.దళితులను రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేసింది.దీంతో టీఆర్ఎస్ పార్టీని పవన్ బాగానే ఇరుకున పెట్టారని.ఈ ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు ఏం సమాధానం ఇస్తారో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు