రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పవన్ ను ఆరాధించేవారు లక్షల సంఖ్యలో ఉన్నారు.
ముఖ్యంగా యూత్ పవన్ ను ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు.యూత్ ఐకాన్ గా పవన్ కళ్యాణ్ కొలుస్తూ వుంటారు.
రాజకీయంగా జనసేన పార్టీ పెట్టి పవన్ సక్సెస్ కాలేకపోయినా, ఇప్పటికీ ఆయన కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.ఇదే విషయాన్న కేంద్ర అధికార పార్టీ బిజెపి సైతం ఎప్పుడో గుర్తించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఏపీలో జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల నాటికి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టాలని చూస్తోంది.ఇక ఏపీ కంటే తెలంగాణలో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండటం, వచ్చే ఎన్నికల నాటికి బలమైన, రాజకీయ ప్రత్యర్థిగా టిఆర్ఎస్ కు ధీటుగా నిలబడ గలుగుతుంది అనే నమ్మకం బిజెపి కేంద్ర పెద్దల్లో ఉంది.
అందుకే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు జోరు మరింత పెంచింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపీ బండి సంజయ్ ను నియమించింది.
ఇక అప్పటి నుంచి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు.లాక్ డౌన్ నిబంధనలు ఉండడంతో పరిమిత స్థాయిలోనే ఆందోళనలు చేస్తున్నా, నిబంధనలు కనుక పూర్తిగా తొలగిస్తే అప్పుడు ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ నాయకులు ఉన్నారు.
కానీ తాము ఎంత పోరాటం చేసినా, కేసీఆర్ వంటి మేధావులను ఎదుర్కోవాలంటే ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుల అవసరం ఉంది అనే విషయాన్ని తెలంగాణ బీజేపీ గుర్తించింది.
అందుకే ఏపీలో తమ రాజకీయ మిత్రుడు ద్వారా తెలంగాణలోని బలపడాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ మేరకు ఆయన జనసేన అధినేత పవన్ కలిశారు.దీంతో తెలంగాణ పవన్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది.
పవన్ తమతో కలవడం ద్వారా తెలంగాణలో తమ రాజకీయ ప్రత్యర్ధులకు దడ పుట్టించాలని బిజెపి చూస్తోంది.అయితే కొన్ని అంశాల్లో పవన్ ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు.
ముఖ్యంగా కృష్ణా జలాలకు సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు సామర్థ్యం పెంపు వంటి అంశాలు పవన్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.ఇదే విషయమై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా పోరాడుతున్నారు.
కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు అమలు అవ్వకుండా చూసేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తూ వస్తున్నారు.కానీ ఈ విషయంలో పవన్ ఏ విధంగా మాట్లాడినా, రాజకీయంగా దెబ్బ తినే అవకాశం ఉంది.రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టుకు పవన్ వ్యతిరేకంగా మాట్లాడితే, ఏపీలో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తెలంగాణలో దాదాపు ఇదే పరిస్థితి.ఈ ఒక్క పరిస్థితి తప్ప మిగతా ఏ విషయాల్లోనూ తెలంగాణ బీజేపీతో కలిసి పని చేసేందుకు పవన్ కు ఎటువంటి ఇబ్బందులు లేవు.
పవన్ చరిష్మా ఉపయోగించుకుని తాను బలమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందడంతో పాటు, తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడించాలి అన్న ఆసక్తి ప్రస్తుతం పవన్ లో కనిపిస్తోంది.మరి ఈ విషయంలో పవన్ ఏవిధంగా అడుగులు వేస్తారన్న దానిపైనే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిక నెలకొంది.