ఏపీలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని అంతా భావించారు.ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చరిష్మా కనీసం 30 నుంచి 35 సీట్లు సాధించేందుకు దోహదం చేస్తుందని అప్పుడు ఏపీలో కీ రోల్ పోషించే అవకాశం దక్కించుకుంటుంది అంతా భావించారు.
అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ జనసేన కేవలం ఒక్కసీటుకే పరిమితం అయిపొయింది.దీంతో పవన్ కు రాజకీయంగా అన్ని దారులు మూసుకుపోయినట్టుగా పరిస్థితులు కనిపించాయి.
ఆ దెబ్బతో మళ్ళీ ఆయన సినిమాల్లో బిజీ అవుతారని, రాజకీయాలకు దూరంగా ఉంటారని అంతా భావించారు.అయితే ఇలా అనుకున్నవారి అంచనాలు తారుమారు చేస్తూ పవన్ పొలిటికల్ గా స్పీడ్ పెంచేందుకు సిద్ధమయ్యారు.
తన టార్గెట్ అంతా 2024 అన్నట్టుగా పవన్ ఇప్పటి నుంచే పార్టీని సిద్ధంచేసే పనిలో పడ్డాడు.
2024లో జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాడు.
ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన పవన్ రేపు పార్టీకి సంబంధించిన కీలక కమిటీలతో పాటు మరికొన్ని కొత్త కమిటీలను కూడా ప్రకటించనున్నారట.గతంలో పార్టీలో కీలక నిర్ణయాలను తీసుకునే కమిటీగా పేరుపడ్డ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) మేథావులు రాజకీయంగా అనుభవం ఉన్న వారితో ఏర్పాటు చేయగా, ఇప్పుడు అదే కమిటీలో మార్పు చేర్పులు చేస్తున్నారట.
ఈ కమిటీతో పాటుగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ, రాజధాని అమరావతి ప్రాంతంలో పార్టీని మరింతగా క్రియాశీలం చేసేందుకు కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మానీటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది మానిటరింగ్ కమిటీ ఇలా ప్రతి అంశంలోనూ పార్టీకి మరింత పట్టును సాధించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇవే కాకుండా ఏపీలోని అన్ని పార్లమెంట్ నియోజకవరాగాలకు కూడా స్పెషల్ గా కమిటీలను వేసి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా పవన్ కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ కమిటీల ప్రకటనను పవన్ మంగళగిరి పరిధిలోని పార్టీ కార్యాలయం నుంచే ప్రకటించబోతున్నారు.పవన్ ఇప్పటి నుంచే పూర్తి స్థాయి కసరత్తు మొదలుపెట్టడం, రానున్న రోజుల్లో మరింత వేగం పెంచేలా కనిపిస్తుండడం జనసేన కార్యకర్తల్లోనూ, పవన్ అభిమానుల్లోనూ హుషారు పెంచుతోంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉండడంతో జనసేన కు రాజకీయ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.పవన్ ఇదేరకమైన స్పీడ్ రానున్న ఐదేళ్లు కొనసాగిస్తారా లేదా అనే దానిపైనే జనసేన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.