తాము తప్పకుండా ఏపీలో అధికారంలో వస్తామన్న ధీమాతో హడావుడిగా ఎన్నికల బరిలోకి వచ్చిన జనసేన పార్టీకి ఫలితాల తరువాత కానీ అసలు విషయం బోధపడలేదు.అంతే కాదు స్వయంగా పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓటమి చెందడాన్ని ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉంది.
అంతే కాదు ఒకే ఒక్క సీటుకే ఆ పార్టీ పరిమితం అయిపొయింది.ఆ ఒక్క సీటూ రాజోలు రిజర్వడ్ నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు.
ఆ తరువాత ఆయన వైసీపీలోకి వెళ్తారని వార్తలు వచ్చినా రాపాక వరప్రసాద్ ఆ విషయాన్ని ఖండించారు.జనసేనలో ఉంటే తన నెంబర్ 1 అని, అదే వైసీపీలోకి వెళితే తన నెంబర్ 152 అంటూ ప్రకటించి పవన్ తరపున అసెంబ్లీ లో గెంతు వినిపిస్తున్నారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన అనూహ్యంగా వైసీపీకి మద్దతుగా మాట్లాడుతూ, జగన్ ను ప్రశంసిస్తూ ఉండడం జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.తాము ముందు నుంచి జగన్ అవినీతిపరుడు, లక్ష కోట్ల దొంగ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తే దానికి భిన్నంగా జగన్ నిజాయితీ పరుడు, ముందు చూపు ఉన్న నాయకుడు అంటూ ప్రశంసించడం పవన్ తో సహా మిగతా పార్టీల నాయకులు ఎవరూ ఇష్టపడడంలేదు.ఇటీవల రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్యెల్యే జగన్ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు.అప్పటికే జనసైనికులు ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉన్నారు.
పేదలు, రైతుల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో చేశారని, ఆయన బాటలోనే జగన్ వెళుతున్నారని చెప్పుకొచ్చారు.అంతే కాదు మత్సకారులంతా జగన్ను దైవంలా భావిస్తున్నారని చెప్పారు.
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.బడ్జెట్ అమలులోనూ పారదర్శకంగా వ్యవహరించాలని, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్యెల్యేలంతా రాపాక మాటలకు మద్దతుగా బల్లలు చరిచి మరీ అభినందించారు.అయితే బడ్జెట్ పై రాపాక స్పందన ఇలా ఉంటే జనసేన మాత్రం బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదని ఆరోపించారు.
నిధుల కేటాయింపు సరిగ్గా లేదని, రాష్ట్ర ప్రగతిని పట్టించుకోలేదని ప్రెస్ నోట్ విడుదల చేసింది.