పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో పోలీస్ డ్రామా గా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అవతారంలో కనిపించి నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అంటూ కేక పుట్టించే డైలాగ్ చెబుతూ ప్రేక్షకులను బాగా అలరించారు.
మే 11, 2012వ తేదీన విడుదలైన గబ్బర్ సింగ్ నేటికి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. 30 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల వరకు వచ్చాయి.
సినిమాలో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినందుకు గాను పవన్ కల్యాణ్ ని ఉత్తమ నటుడి అవార్డు తో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది.
ఇక ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకుంటే హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టయిన దబాంగ్ సినిమాకి రీమేక్ చేయాలని పవన్ కల్యాణ్ ఆసక్తి చూపించారు.
దీనితో అర్బాజ్ ఖాన్ రీమేక్ హక్కులను పవన్కు విక్రయించారు.మొదటగా ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మించాలనుకున్నారు.
కానీ ఆ తర్వాత బండ్ల గణేష్ పరమేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాని నిర్మించారు.అయితే రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన తర్వాత సినిమాని డైరెక్ట్ చేయాలని హరీష్ శంకర్ ని పవన్ ఆశ్రయించారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దబాంగ్ తెలుగు రీమేక్ సినిమా రూపొందించాలని హరీష్ శంకర్ ని పవన్ కోరగా ఆయన ఒరిజినల్ సినిమాకి భిన్నంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దగ్గరగా బ్రహ్మాండమైన స్క్రిప్టు రెడీ చేసారు.అయితే హరీష్ శంకర్ అంతాక్షరి, కబడ్డీ వంటి కొత్త సీక్వెన్స్ లతో రాసిన స్క్రిప్టు బాగా నచ్చడంతో పవన్ కల్యాణ్ స్క్రిప్ట్ చాలా ఫ్రెష్ గా ఉంది తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉంది అని బాగా పొగిడారు.
అనంతరం పవన్ ఈ మూవీకి గబ్బర్ సింగ్ గా టైటిల్ పెట్టారు.
ఒరిజినల్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన సోనూసూద్ ని మళ్లీ అదే పాత్ర తెలుగులో చేయమని కోరారు కానీ అందుకు ఆయన అంగీకరించలేదు.దీంతో ఆ రోల్ కోసం అభిమన్యు సింగ్ ని ఎంచుకున్నారు.రక్త చరిత్ర సినిమాలో అభిమన్యు పర్ఫామెన్స్ ని ఫిదా అయిపోయిన హరీష్ తన సినిమాలో సిద్దప్ప నాయుడు పాత్రకి అభిమన్యు బాగా సూట్ అవుతారని అతన్ని ఎంచుకున్నారు.
అయితే ఒరిజినల్ మూవీ లో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించగా రీమేక్ మూవీలో ఇలియానాని ఎంపిక చేసుకున్నారు.కానీ ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శృతిహాసన్ హీరోయిన్ గా చేశారు.
ఆమె ఫస్ట్ ఆఫ్ సినిమాలో లంగా వోని తో అలరించి సెకండ్ హాఫ్ లో చీర కట్టు అందాలతో ప్రేక్షకుల మనసులను దోచేశారు.
కెవ్వు కేక ఐటమ్ సాంగ్ కోసం పార్వతి మెల్టన్, అనుష్క శెట్టి లను ముందుగా అనుకున్నారు కానీ చివరికి బాలీవుడ్ బ్యూటీక్వీన్ మలైకా ఆరోరా ని తీసుకున్నారు.ఈ ఒక్క పాట కోసం ఆమె కోటి రూపాయల రెమ్యూనరేషన్ పుచ్చుకున్నారని వార్తలు వెల్లువెత్తాయి కానీ బండ్ల గణేష్ ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించారు.
2011 అక్టోబరు 2వ తేదీన గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.పోలీస్ స్టేషన్ లో జరిగే సన్నివేశాలను పొల్లాచిలో చిత్రీకరించారు.సినిమా చిత్రీకరణ ప్రారంభం కాగానే పవన్ కల్యాణ్ జాయిన్ రాలేదు.ఎందుకంటే అప్పట్లో పంజా సినిమా కోసం పవన్ తన గడ్డం క్లీన్ షేవ్ చేస్తున్నారు.దీంతో గడ్డం పొడవుగా పెరిగేంతవరకు ఆయన గబ్బర్ సింగ్ సినిమా సెట్స్ లో పాల్గొనలేదు.
2011 డిసెంబరు నాలుగో తేదీన ఆయన చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ సినిమాలోని ఆకాశం అమ్మాయైతే పాట పొల్లాచి లోని పచ్చని పొలాల్లో ప్లాన్ చేసారు కానీ వాతావరణం బాగోలేక హైదరాబాద్ లో పాట షూట్ చేశారు.
హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై క్లైమాక్స్ చిత్రీకరించారు.దేకో దేకో గబ్బర్ సింగ్ పాట గుజరాత్ లో నాలుగు రోజుల పాటు షూట్ చేశారు.
మందు బాబులం పాట కోట శ్రీనివాసరావు పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.
మొత్తంమీద గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్ పరిశ్రమలో వచ్చిన ఒక ఉత్తమ చిత్రంగా నిలిచింది.