ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రహస్య మిత్రులు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు.ఈ రెండు పార్టీల విధానాలు వేరు వేరు అయినా, ఇద్దరు దాదాపుగా ఒకే విధంగా తమ ఆలోచనలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ఇటువంటి అనుమానపు వ్యవహారాలతో వైసిపికి టార్గెట్ అయిపోతూ వస్తున్నారు.ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై అదేపనిగా విమర్శలు చేస్తూ, ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఒకపక్క టిడిపి అధినేత చంద్రబాబు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నారు.ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని ఏపీ ప్రభుత్వం పై బీజేపీ సహాయంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ఏపీలో సంభవించిన భారీ వర్షాల కారణంగా, పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తి నష్టం సంభవించింది.ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఏపీలో ప్రజలు, రైతులు ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ అదేపనిగా జనసేన టిడిపి విమర్శలు చేస్తూ వస్తున్నాయి.
అయితే ఇదే వారికి ఇబ్బందికరంగా మారింది.ఏపీతో పాటు తెలంగాణలో రెండు పార్టీలు తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్నాయి.పూర్తిగా ఏపీ వ్యవహారాలపై దృష్టి పెట్టినా, అప్పుడప్పుడు తెలంగాణలోనూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తాము అంటూ హడావుడి చేస్తూ వస్తున్నారు.ఏపీ సీఎం జగన్ తో సన్నిహితంగా ఉండే, కెసిఆర్ కు పవన్, చంద్రబాబు ఇద్దరూ రాజకీయ శత్రువులే అయినా అక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం లోపాలను ఎత్తి చూపేందుకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడంలేదు.
ఒక రకంగా చెప్పాలంటే వరదల కారణంగా ఏపీకి జరిగిన నష్టం కంటే, తెలంగాణకు జరిగిన నష్టం ఎక్కువ.
ముఖ్యంగా హైదరాబాద్ నగర వీధులను వరదలు ముంచెత్తడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.జీహెచ్ఎంసీ పరిధిలో వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి, అభివృద్ధి చేయించాం అంటూ గొప్పలు చెబుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ వరదలు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.ఇదంతా టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపు లేకపోవడం అంటూ కాంగ్రెస్, బిజెపిలు విమర్శిస్తున్నా, టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేసేందుకు అటు టీడీపీ అధినేత చంద్రబాబు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ స్పందించక పోవడంపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ అంటే ఇద్దరు నేతలకు ఎక్కడ లేని భయం అని, అందుకే వారు ఏపీ లో విమర్శిస్తున్న ట్టుగా, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సాహసం చేయలేకపోతున్నారు అంటూ పదేపదే ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నా, ఈ రెండు పార్టీల అధినేతలు మౌనంగానే ఉంటున్నారు.పేరుకి రెండు పార్టీలు తెలంగాణలో ఉన్నా, పూర్తి దృష్టి మొత్తం ఏపీ పైనే ఉండటంతో, ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు గా కనిపిస్తున్నారు.
కెసిఆర్ తో పెట్టుకుంటే ఎక్కడలేని ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతోనే తెలంగాణలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయినా ఫర్వాలేదు అన్నట్టుగానే వ్యవహరిస్తూ అనవసర విమర్శలు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తున్నారు.