జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి వ్యవహారశైలిని కాస్త అసహనంగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు పవన్ కు ఆగ్రహం కలిగించడంతో ఏపీలో ఒంటరిగానే వివిధ పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జిల్లాల బాట పడుతున్నారు .ఈ విషయంలో బీజేపీ ని సంప్రదించకుండా నే పవన్ ఒంటరిగా ముందుకు వెళ్తున్నారు.ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేసే విషయమై క్లారిటీ తో ఉంది.అయితే తమ మిత్రపక్షమైన బిజెపి సైతం ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో , దీనిపై క్లారిటీ తెచ్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్ దీనిపై ఒక కమిటీని నియమించి చర్చిద్దామని ప్రయత్నించినా బిజెపి ఢిల్లీ పెద్దలు దానిని వాయిదా వేయడంతో సైలెంట్ గా ఉంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో అయినా, తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీకి దింపాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.ఈ విషయంలో బీజేపీ తో సైతం విభేదించే విధంగా జనసేన వ్యవహారశైలి కనిపిస్తోంది.అసలు ఇంత సీరియస్ గా పవన్ దీనిపై దృష్టి పెట్టడం వెనక కారణాలు చాలానే ఉన్నట్టు తెలుస్తోంది.2019 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అభ్యర్దికంటే జనసేన మద్దతు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి కి ఎక్కువ ఓట్లు రావడం దీనికి కారణం కనిపిస్తుంది.బిఎస్పీ తో పొత్తులో భాగంగా తిరుపతి ఎంపీ సీటును కేటాయించారు.అయితే ఇప్పుడు నేరుగా జనసేన పోటీకి దిగి తమ సత్తా చాటుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
మొత్తంగా తిరుపతి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నా, అధికార పార్టీ పై ప్రజా వ్యతిరేకత, తిరుపతి లో పార్టీకి ఉన్న పట్టు, బిజెపి బలం వీటితోపాటు పరోక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా తమకు మద్దతు ఇస్తుందనే అభిప్రాయంతో జగన్ ఇప్పుడు పోటీకి సై అన్నట్టుగా ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తోంది.త్వరగా సినిమా షూటింగ్ లను పూర్తి చేసుకుని పూర్తిగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలపై దృష్టి సారించే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం రైతుల తరుపున జిల్లా టూర్ లు ప్లాన్ చేసుకుంటున్న పవన్ ఇక ముందు ముందు అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.