ఆషామాషీగా రాజకీయాలు చేస్తే లాభం ఉండదు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ జనాల్లో బలం పెంచుకుంటూ, పార్టీ నాయకులలో ఉత్సాహం రేకెత్తించే విధంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయంలో బీజేపీ తమతో కలిసి వస్తుందా రాదా అనే విషయాన్ని సైతం పవన్ పట్టించుకోవడం లేదు.ఒంటరిగానే పర్యటనలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇక వరుసగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి జనసేన పై జనాల్లో చర్చ జరిగే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించి తమ పార్టీ నాయకుల్లో ఉత్సాహం కలిగించారు.దాని ప్రభావం స్పష్టంగా కనిపించడం తో, ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయం తీసుకుంది.రైతు సమస్యలపై అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు అవుతారని జనసేన వర్గాలు పేర్కొన్నాయి.కౌలు రైతుల కోసం, భూమి దున్నే రైతు కోసం జనసేన జై కిసాన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.ముఖ్యంగా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం స్పందించలేదని, వారికి ఎటువంటి నష్టపరిహారం అందించలేదని, ప్రతి ఎకరానికి 35 వేలు చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, తక్షణ సహాయం కింద పది వేలు ఇవ్వాలని జనసేన డిమాండ్ చేస్తోంది.ఈ అంశమే ప్రధాన అజెండాగా ఇప్పుడు 28వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
రైతుల లో జనసేన పై ఆదరణ పెరిగే విధంగా చేసుకోగలిగితే తిరుగుండదని పవన్ బలంగా నమ్ముతున్నారు.దీంతో పాటు కార్మికులు, మహిళలను ఆకట్టుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించి ముందుకు వెళ్లే విషయంపై జనసేన దృష్టి పెట్టింది.
కాకపోతే జనసేన నిర్వహిస్తున్న కార్యక్రమాలు వేటికీ బిజెపి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.