ఏపీ లో పొత్తు పెట్టుకున్న బీజేపీ జనసేన పార్టీల వ్యవహారం అందరికి తెలిసిందే.రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా, ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.2024 ఎన్నికల్లో కలిసి కట్టుగా ఎన్నికలకు వెళ్లి వైసీపీ ని ఓడించి అధికారం చేపట్టాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.కానీ ఈ రెండు పార్టీలు విడివిడిగానే ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాయి.
ఒకరికొకరు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో , ఆ పార్టీ నాయకుల్లో సైతం ఆందోళన కలిగిస్తోంది.త్వరలో జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన – బీజేపీ ఈ రెండు పార్టీలలో ఎవరు పోటీ చేస్తారు అనే విషయం లో ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు.
ఈ విషయంలోనే రెండు పార్టీలకు మధ్య విభేదాలు తలెత్తుతూ ఉండడం వంటి కారణాలతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఇక ఎంతోకాలం కొనసాగదని అందరూ అంచనాకు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి జనసేన పార్టీకి మధ్య గ్యాప్ వచ్చిన మాట నిజమే నంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా బీజేపీలో కంగారు మొదలైంది.ఆగమేఘాల మీద బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తిరుపతి ఎన్నికలలో ఎవరు పోటీ చేసినా, ఒకరికొకరు సహకరించుకోవాలి అనే తీర్మానం ఈ సందర్భంగా పవన్ కి వీర్రాజు కి మధ్య కుదిరింది.అలాగే అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.
కొద్ది నెలల క్రితం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని దీనికి జనసేన పార్టీ సహకరిస్తుందని సోము వీర్రాజు ప్రకటించడం దగ్గర నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి వస్తున్నాయి.అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది.
తిరుపతిలో జనసేన అభ్యర్థిగా పోటీకి దిగితే ప్రచారం అంతా తన భుజాన వేసుకుంటాను అంటూ పవన్ ప్రకటించారు.అయితే బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆ పార్టీ అభ్యర్థి తరఫున జాతీయ స్థాయి నేతలు వస్తారు అంటూ పవన్ ప్రశ్నించడం వంటి వ్యవహారాలతో బీజేపీలో కంగారు మొదలైనట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే ఏపీ బీజేపీ కాపులను దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.అది కాకుండా జనసేన కు ఉన్న క్రేజ్ , పవన్ అభిమానుల అందరి సహకారంతో తాము అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీతో 2014 ఎన్నికల వరకు కొనసాగించాలని ఆకాంక్షతోనే ఉన్నారు.రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.దానిలో భాగంగానే ఇప్పుడు నష్టనివారణ చర్యలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగినట్టుగా కనిపిస్తోంది.