విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జనసేన మొదట్లో పోరాటం చేపట్టే దిశగా అడుగులు వేసింది.ఈ మేరకు జనసేన స్టేట్మెంట్స్ ఇచ్చింది.
అంతే కాదు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి మరీ అమిత్ షా వంటి వారిని కలిసి స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరించ వద్దు అంటూ కోరారు.కానీ బీజేపీ పెద్దలు పవన్ కు బ్రెయిన్ వాష్ చేయడంతో వెనక్కి తగ్గిపోయారు.
స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కేవలం విశాఖను, ఏపీని దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు అని, దేశాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది అంటూ పవన్ స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీకే తమ మద్దతు అని క్లారిటీ ఇచ్చేసారు.అయితే పవన్ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కు విరుద్ధంగా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విశాఖ ఉక్కు అంశం పై మరోసారి స్పందించిన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని, దీనికోసం ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని, ఇవన్నీ చేసి వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అంటూ పవన్ డిమాండ్ చేస్తున్నారు.కేవలం పాదయాత్రలు, ప్రకటనల వరకు పరిమితమైతే సరిపోదని, విశాఖ కార్పొరేషన్ గెలుపుతో వైసిపి బాధ్యత మరింతగా పెరిగింది అని వ్యాఖ్యానించారు.మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సంపూర్ణ విజయం దక్కించుకోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది భావోద్వేగాలతో కూడుకున్నదని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోందంటూ పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయని, రైతులకు ఇంకా పరిహారం అందలేదని, అలాగే కార్మికులకు అండగా నిలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాం అంటూ పవన్ వ్యాఖ్యానించారు.
గతంలోనే స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు వినతిపత్రం ఇచ్చామని, ఈ వ్యవహారంపై గట్టిగా మాట్లాడేందుకు పార్లమెంటు సభ్యులు లేరు అని వ్యాఖ్యానించారు.మీకు 22 మంది సభ్యులు ఉన్నారని, స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని వైసిపి ఎందుకు ముందుకు తీసుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జనసేనపై నిందలు రాకుండా తెలివిగా ఇప్పుడు వైసీపీని, బీజేపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశం కోసం అంటూ ముందుగా చెప్పిన పవన్ ఇప్పుడు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తుండడంతో అయోమయ పరిస్థితి ఆ పార్టీ నేతల్లోనూ నెలకొంది.