రాజకీయాలకు దూరం అన్నట్లు వ్యవహరిస్తూ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.అసలు రాజకీయాలకు ఎంత దూరంగా ఉందామని చిరు ప్రయత్నించినా, ఏదో ఒక సందర్భంలో రాజకీయ వ్యవహారాలపై స్పందిస్తూ సంచలనం రేపుతూనే ఉన్నారు.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టి అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నా , నేరుగా చిరంజీవి జనసేన కు మద్దతు ఎప్పుడూ పలకలేదు.అయితే పవన్ బద్ధ శత్రువుగా చూస్తున్న జగన్ తోనూ, తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే చిరంజీవి సఖ్యత గా మెలుగుతూ వస్తున్నారు.
ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం మొగ్గు చూపిస్తోంది.
ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయడంతో, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతున్నారు.వైసిపి, టిడిపి వంటి పార్టీలు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు పలికాయి.
వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలను జనాల్లోకి పంపించాయి.అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, జనసేన మాత్రం మొదట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించినా, ఆ తరువాత దేశ శ్రేయస్సు దృష్ట్యా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని , తాము కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నాం అంటూ పవన్ సంచలన ప్రకటన చేశారు.
దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి పవన్ వస్తారని ఆశలు పెట్టుకున్న ఆ ప్లాంట్ కార్మికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.జనసేన నాయకులు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు.
సరిగ్గా ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడాన్ని తప్పు పడుతూ , ట్విట్టర్ లో స్పందించారు.
స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయించకుండా, నష్టాల్లో ఉందని చెప్పి ప్రైవేటీకరించడం సరికాదంటూ విశాఖ ఉద్యమానికి మద్దతు పలికారు.అసలు స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి చిరంజీవి స్పందించడమే గొప్ప విషయం.అసలు ఆయన ఇలా మద్దతు పలుకుతారని ఎవరూ ఊహించలేదు.
కానీ ఈ వ్యవహారంపై స్పందించడానికి కారణం ఉంది.ఆ విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ 1960లో లో చిరంజీవి పాత్ర కూడా ఉందట.ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వై ఎన్ ఎం కాలేజీలో చదువుతున్న సమయంలో ఈ ఉద్యమం మొదలైందట.
అప్పుడు స్వయంగా చిరంజీవి పెయింట్, బ్రష్ పట్టుకుని విశాఖ ఉక్కు నినాదాలు గోడలపై రాశారు.ఇదే విషయాన్ని చిరంజీవి స్వయంగా ప్రకటించారు.
ఎంతో పోరాడి, సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటీకరణ కావడంపై చిరంజీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి ఈ ప్లాంట్ వ్యవహారంపై స్పందించడం ఇప్పుడు పవన్ కు ఇబ్బందికరంగా మారింది.
రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగుతున్న పవన్ కేంద్రం నిర్ణయం సమర్థించడాన్ని అంతా తప్పు పడుతున్నారు.ప్రతి వ్యవహారంలోనూ చిరంజీవి పవన్ స్పందనలు వేరువేరుగా ఉండడం పైనా మెగా అభిమానులు జనసైనికులు అయోమయాన్ని కలిగిస్తోంది.
పవన్ ను ఇరుకున పెడుతోంది.