రైతు సమస్యలపై పోరాడేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడంలేదని, సరైన సమాధానం చెప్పడం లేదని, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ధరలు చెల్లించి లేదని, దీని కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని జనసేన పార్టీ ఆరోపిస్తోంది.
రైతు సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ పవన్ డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు ఈరోజు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
కాకినాడలో డిసెంబర్ 12వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు పవన్ రైతు దీక్ష ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలంటూ ఆయన కోరారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అవకతవకలను బయటకు వెల్లడించి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలబడేందుకు పవన్ సిద్ధమవుతున్నట్టు నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ మేరకు జనసేన పార్టీ నుంచి ఓ పత్రికా ప్రకటన కూడా వెలువడింది.