పవర్ స్టార్ గా సినిమాల్లో తనను తాను నిరూపించుకోవడమే కాకుండా, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్.వాటిని ఉపయోగించుకుని రాజకీయాల్లో సక్సెస్ అవ్వాలని, జనసేన పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు.
గతంలో తన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో పార్టీ పెట్టినా, సక్సెస్ కాలేకపోవడం, ఆయనకు అనేకమంది వెన్నుపోటు పొడిచారనే కోపం, ఇలా అన్నిటిని విశ్లేషించుకుని పవన్ జనసేన పార్టీని ప్రజారాజ్యం పార్టీలా కాకుండా, బలమైన పార్టీగా తీర్చిదిద్ది, ఏపీలో అధికారం దక్కించుకోవాలని భావించారు.ఎలాగూ కాపు సామాజిక వర్గం తనకు అండగా నిలబడుతుందని, కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు కాబట్టి, తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని పవన్ అభిప్రాయపడ్డారు.
కానీ రాజకీయాలు అంటే సినిమాల్లో నటించినత సులభం కాదని, కాస్త ఆలస్యంగా పవన్ గుర్తించారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అసలు పవన్ మొదటి స్టెప్ లోనే తప్పటడుగు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.2014 ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారని భావించినా, తనకు పెద్దగా బలం లేదని, పూర్తిగా జనసేనను బలోపేతం చేసిన తర్వాతే పోటీ చేస్తానంటూ ప్రకటించి ఏపీలో టిడిపికి, కేంద్రంలో బీజేపీకి పవన్ అండగా నిలవడంతో పాటు, ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అంతా అనుకున్నట్టుగానే, ఆ రెండు పార్టీలు అధికారాన్ని దక్కించుకున్నాయి.
ఇక పవన్ అప్పటి నుంచి ఏపీలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగానే కొనసాగుతూ వచ్చి, టిడిపికి ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన శత్రువుగా, టీడీపీతో పాటు జనసేన కూడా భావించేది.అప్పటి నుంచి ఆ పార్టీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ వచ్చారు.కానీ అయిదేళ్ల కాలంలో పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించలేకపోయారు.
ఫలితంగా పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోయింది.అడపాదడపా ప్రజా సమస్యలపై స్పందిస్తూ, టిడిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పవన్ హడావుడి చేయడంతో ఆయన పై టిడిపి ముద్ర పడిపోయింది .ఫలితంగా 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవి చూడాల్సి రావడం, జనసేన కు, పవన్ కళ్యాణ్ కు పెద్ద అవమానమే మిగిల్చింది.కానీ ఆ ఓటమి ప్రభావం నుంచి తొందరగానే తేరుకున్నారు.పవన్ ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, కాస్త హడావిడి చేశారు.
సొంతంగానే బలం పెంచుకుంటున్న సమయంలో, మళ్లీ అకస్మాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు.పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి పూర్తిగా బిజెపి కంట్రోల్ లోకి వెళ్ళిపోయినట్లు గా వ్యవహరించారు.
అప్పటి వరకు చేసిన ప్రజా ఉద్యమాలు అన్నిటినీ పక్కనబెట్టి, సైలెంట్ అయిపోయారు.బిజెపి స్పందనను బట్టి పవన్ స్పందిస్తూ వచ్చారు.
ఇక బీజేపీతో కలిసి కార్యాచరణ రూపొందించుకుని, ప్రజల్లోకి వెళ్లి బలోపేతం అవ్వాలని 2024 లో అధికారం దక్కించుకోవాలని పవన్ భావించి, ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారు, అకస్మాత్తుగా బీజేపీ ఇప్పుడు జగన్ వైపు మొగ్గు చూపడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించడం, ఇవన్నీ ఇప్పుడు పవన్ కు ఏ మాత్రం రుచించడం లేదు.ఈ పరిస్థితుల్లో మళ్లీ పవన్ ఒంటరి పోరాటం ఎంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు.బిజెపి వ్యతిరేకిస్తున్న వివిధ సమస్యల పైనా, పవన్ గళమెత్తేందుకు సిద్ధమవుతున్న తీరు చూస్తే, మళ్లీ ఆయన బీజేపీ ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటికే పవన్ ఒంటరి పోరాటం ఎంచుకున్నా, కలిసొచ్చే ప్రయోజనం ఏమి లేదు.
ఆర్థికంగానూ, ఏపీ ప్రభుత్వం వేధింపులు లేకుండా ఉండాలంటే ఇష్టమున్నా, లేకపోయినా, సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు పవన్ కు ఏర్పడింది.పోనీ అకస్మాత్తుగా బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకుందామంటే, బీజేపీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, అలా జరిగితే మొదటికే మోసం వస్తుంది అనేది పవన్ భయం.ఆ భయంతోనే అటు ముందుకు వెళ్ళలేక, వెనక్కి కూడా వెళ్ళలేక, పవన్ సతమతం అయిపోతూ, రాజకీయ గందరగోళంలో ఉన్నట్టు గా వ్యవహరిస్తున్నారు.ఇలా ఎన్నో స్వయంకృపరాధాల కారణంగా పవన్ రాజకీయంగా ఎదగలేకపోతున్నట్టుగా కనిపిస్తున్నారు.