హాస్పిటల్ లో అత్యంత అరుదైన ఆపరేషన్లు డాక్టర్లు చేస్తూ ఉంటారు.గుండెకి సంబందించిన ఆపరేషన్లు, అలాగే మెదడుకి సంబందించిన ఆపరేషన్లు చేస్తూ ఉన్నప్పుడు నిజానికి రోగులు భయపడుతూ ఉంటారు.
ఈ నేపధ్యంలో వాళ్లకి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తారు.అయితే కొంత మంది బ్రెయిన్ ఆపరేషన్ చేస్తూ ఉన్న సమయంలో రోగికి ఎనస్థీషియా ఇచ్చి అతనికి నొప్పి లేకుండా చేసి ఏదో ఒక టీవీ షోనో, లేక వారికి ఇష్టమైన సినిమానో చూపిస్తూ ఆపరేషన్ చేస్తూ ఉంటారు.
ఇలాంటివి అరుదుగా జరుగుతూ ఉంటాయి.ఇప్పుడు అలాగే గుంటూరులో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో రోగికి బిగ్బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ కి 2016లో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు శస్త్రచికిత్స జరిగింది.అయితే గత కొన్ని నెలలుగా అతనికి ఫిట్స్ వస్తుండడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో కణితి మళ్లీ పెరుగుతున్నట్టు గుర్తించారు.దానిని తొలగించేందుకు మెదడు త్రీడీ మ్యాప్ను సిద్ధం చేసుకుని కణితి ఎక్కడుందో గుర్తించి సరిగ్గా అక్కడ మాత్రమే కపాలాన్ని తెరిచి ఆపరేషన్ చేసి తొలగించారు.
అయితే, మనిషి మాట్లాడేందుకు ఎంతో కీలకమైన ప్రాంతంలో ఆపరేషన్ చేయాల్సి రావడంతో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించారు.అతడిని మెలకువగా ఉంచి, మాట్లాడిస్తూ టీవీలో బిగ్బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు.
రోగి వరప్రసాద్కు ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారు కావడం గమనార్హం.ఇప్పుడు ఈ ఆపరేషన్ స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.