తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చక్కబడుతుందని ఎప్పటికప్పుడు అంతా భావిస్తూ వస్తున్నా, ఇక్కడ పొలిటికల్ వాతావరణం మాత్రం వేరే విధంగా చోటుచేసుకుంటోంది.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించే ఆలోచనలో ఉందనే విషయం బయటకు వచ్చిన దగ్గరనుంచి సీనియర్లు ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని బయట పెడుతూనే వచ్చారు .
ఎప్పుడూ లేని విధంగా సీనియర్ కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి రేవంత్ కు వ్యతిరేకంగా అధిష్టానం వద్ద పావులు కదిపారు.రేవంత్ కు కాకుండా మరి ఎవరికి పదవి ఇచ్చినా పర్వాలేదని , రేవంత్ కు ఇస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేశారు.
ఏదైతేనేం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సీనియర్లను పక్కన పెట్టి కాంగ్రెస్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ కు బాధ్యతలు అప్పగించింది.దీంతో సీనియర్లు తీవ్ర అసంతృప్తితోనే రేవంత్ నాయకత్వాన్ని సమర్ధించారు.
అవకాశం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు.
రేవంత్ పిలుపునిచ్చిన పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, రేవంత్ కు మద్దతుగా అన్ని విషయాల్లో నిలబడక పోవడం వంటివి ఇప్పటికీ ఇబ్బందికరంగా మారింది.
సీనియర్ నాయకులు రేవంత్ కు వ్యతిరేకంగా అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసే ప్రయత్నాలు చేస్తున్నా, అవి అంతగా వర్కవుట్ కావడం లేదు.అయినా రేవంత్ మాత్రం ఒంటరిగానే తన పోరాటం కొనసాగిస్తు, దూసుకుపోతున్నారు.
ఇప్పటికే రెండుసార్లు రాజ్ భవన్ ముట్టడి , మూడు సార్లు భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించి సీనియర్లు సహకారం పెద్దగా లేకపోయినా, తాను మాత్రం దూకుడుగా వ్యవహరిస్తాను అనే సంకేతాలు పంపించారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి , జగ్గారెడ్డి ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు రేవంత్ దూకుడుతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు.రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్న, అధిష్టానం మాత్రం అవేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేకపోవడం, రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో ఉండడంతో సీనియర్ లు మరింత ఆగ్రహానికి , అసంతృప్తికి గురవు తున్నారు.తమ కంటే బాగా జూనియర్ అయిన రేవంత్ డైరెక్షన్ లో తాము నడవడం తమకు అవమానమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరే తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి కారణం గా కనిపిస్తోంది.