నిన్న విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసి ఒక్క సారిగా తెలుగుదేశం పార్టీలో కంగారు మొదలైంది.ఫలితాలు వైసిపికి అనుకూలంగా ఉంటాయనే విషయం టిడిపి ముందుగా ఊహించిందే అయినా, ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం అస్సలు ఊహించలేకపోయింది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత దారుణమైన ఫలితాలు వచ్చాయో, ఇప్పుడు అంతే స్థాయిలో ఫలితాలు రావడం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది.2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చినా, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బాగా బలం పుంజుకుందని, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో టిడిపి ప్రభావం గట్టిగానే ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఊహించారు.మున్సిపల్ ఎన్నికలలో అంతకంటే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశించినా, ఘోర పరాజయం ఎదురైంది.కనీసం ఈ మున్సిపల్ ఎన్నికలు 23 కార్పొరేషన్ లు దక్కించుకుంటాము అని, 10 నుంచి 15 వరకు మున్సిపాలిటీలు తగ్గించుకుంటాము అని ఆరాటపడ్డాయి.
కానీ మూడు కార్పొరేషన్ లలోనూ పార్టీ ఘోర పరాజయం పాలైంది అలాగే పదే పదే చెబుతూ వస్తున్న అమరావతి ప్రాంతమైన గుంటూరు విజయవాడలోనూ ఇదే పరిస్థితి.ఇప్పుడు ఈ ఫలితాలతో టిడిపి నేతలు ఉసూరుమంటున్నారు.
పార్టీ క్రమక్రమంగా పుంజుకుంది అని, వైసీపీ పాలనపై వ్యతిరేకత వచ్చింది అని అంతా అనుకుంటున్న సమయంలో, ఈ ఫలితాలను పార్టీ నేతలెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగింది ? ఎందుకు పార్టీ పరిస్థితి రోజు రోజుకు ఈ విధంగా దిగజారుతోంది అనే చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది.పార్టీలో అంతర్గతంగా నెలకొన్న లోపాలను పరిష్కరించకుండా, పదేపదే ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రజల్లో కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలపై పూర్తిగా సానుకూలత ఉన్నా వాటిపైనా విమర్శలు చేయడం వంటివి ఎన్నో టీడీపీకి ఈ పరిస్థితి తీసుకొచ్చాయి.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా చెప్పుకుంటున్న వారెవరూ పార్టీ కార్యక్రమాలపై అంతగా దృష్టి పెట్టడం లేదని, పదవులు ఉంటే తప్ప పార్టీలో యాక్టివ్ గా ఉండము అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకుండా తామే పెత్తనం చేయాలి అన్నట్టుగా వ్యవహరించడం, ఇలా ఎన్నెన్నో దెబ్బకొట్టాయట.చాలాచోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టక ముందే ఓటమిని అంగీకరించినట్లు గా పోటీకి అభ్యర్థులు దూరంగా ఉండటం వంటి కారణాలతో వైసిపికి ఎక్కువగా ఏకగ్రీవాలు దక్కాయి.అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న వారు కావడం, వారికి సరైన రాజకీయ వ్యూహాలు సీనియర్ల నుంచి అందకపోవడం, వైసీపీ బలంగా ఉందనే భయం టిడిపి నాయకుల్లో ఎక్కువవడం, పార్టీ అధిష్టానం నుంచి సరైన సలహాలు, సూచనలు ఆర్థిక అండదండలు అందకపోవడం ఇలా ఎన్నో కారణాలతో టిడిపి ఈ స్థాయిలో ఓటమి చెందడానికి కారణం గా కనిపిస్తోంది.
పార్టీలోని అగ్రనాయకులే ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటించిన టిడిపి అధినేత చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మీకు సిగ్గుందా అంటూ తీవ్రపదజాలంతో ప్రజల తీరును తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఇలా టిడిపి ఓటమిలో భాగం అయ్యాయి.ఈ ఫలితాలతో స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలు చేయాలని, ఎప్పుడూ ఓకే రకమైన పరిస్థితులు ఉంటాయనుకోవడం పొరపాటేనని, ముఖ్యంగా అధినేత చంద్రబాబు తో పాటు, పార్టీ సీనియర్ నాయకులు ఈ విషయాలపై దృష్టి పెట్టి తమ వ్యవహారశైలి మార్చుకోకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి మరింత దెబ్బతింటుందని, పార్టీ నుంచి వలసలు అధికమవుతాయనే టెన్షన్ పెరిగిపోతోందట.