తెలంగాణ సీఎం కేసీఆర్ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా యాక్టివ్ అవ్వడం , పార్టీలో కీలక మార్పులు చేస్తూ మళ్లీ అధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేయడం, హుజురాబాద్ దుబ్బాక ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘోరంగా ఓటమి చెందడం, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే నివేదికలు అందడం, ఇలా ఎన్నో కారణాలతో పార్తీని పరుగులు పెట్టించేందుకే సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ , టిఆర్ఎస్ పరపతిని తెలంగాణలో పెంచేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు .
అయితే పార్టీ నాయకుల్లో మాత్రం కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.దీనికి కారణం ఎప్పటి నుంచో నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారు.
మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారికి కాకుండా, వివిధ పార్టీల నాయకులు నామినేటెడ్ పదవులు పొంది మరీ టిఆర్ఎస్ లో చేరారు.
అటువంటి నాయకులు అందరికీ పదవులు ఇవ్వకుండానే కాలం నెట్టుకొస్తూ ఉండడంతో, వారిలో అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో చర్చ జరుగుతోంది.చాలా వరకు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి .మొత్తం అన్ని స్థానాల్లోనూ టిఆర్ఎస్ పాగా వేయబోతోంది.ఈ ఎమ్మెల్సీ పదవుల విషయంలోనూ చాలా మంది నేతలు అసంతృప్తికి గురయ్యారు.
ఉన్న పోస్టుల కంటే పదవులు ఇస్తామని హామీలు పొందిన వారు ఎక్కువగా ఉండడంతో , ఎన్నికల సందర్భంగా ఎంతో మంది నాయకులు అలక చెందడం కనిపించింది.దీంతో చాలామంది అసంతృప్తి నాయకులు పార్టీ మారేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు.
వీరి సంగతి పక్కన పెడితే చాలా మంది నియోజకవర్గ స్థాయి నాయకులు నామినేటెడ్ పదవుల విషయంలో చాలాకాలం నుంచి ఎదురు చూపులు చూస్తున్నారు.
మొదటి విడత టిఆర్ఎస్ ప్రభుత్వం లో నామినేటెడ్ పదవుల కోసం చాలామంది ఎదురు చూసినా, వారికి నిరాశే ఎదురైంది.
రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కెసిఆర్ శ్రద్ధ చూపించడం లేదని, మళ్లీ ఎన్నికల సమయం దగ్గర కు వచ్చేస్తున్న పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారనే అసంతృప్తి పార్టీ నాయకులలో కనిపిస్తోంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ చేపడతారని అంత ఆశలు పెట్టుకున్నారు.
అయితే ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో వీరి ఆశలు నెరవేరలేదు. ఇక 2018 నుంచి నామినేటెడ్ పదవుల కోసం వేచి చూస్తున్న కొంతమందికి కేసీఆర్ పదవులు ఇచ్చారు.
టి ఎస్ ఆర్టీసీ చైర్మన్, బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నియామకాన్ని చేపట్టారు అయితే ఇంకా 500కు పైగా నామినేటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
చాలాకాలం నుంచి వీటిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు .ఈ పదవులలో తమకు అవకాశం వస్తుందని నియోజకవర్గ స్థాయి కీలక నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా, ఎప్పుడూ ఏదో ఒక కారణంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని కెసిఆర్ వాయిదా వేస్తూ వస్తున్నారనే అసంతృప్తి పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఈ పరిణామాలన్నీ బిజెపి తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.
టిఆర్ఎస్ లో అసంతృప్త నేతలు అందరిని గుర్తించి బిజెపిలో చేర్చుకుని వారికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకమైన పదవులు ఇస్తామనే హామీ ఇస్తూ, తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందట.