ఎన్నారైల మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బిల్లుకు కేంద్ర విదేశీ వ్యవహారాల స్థాయి సంఘం శుక్రవారం ఆమోదాన్ని తెలిపింది.భారతీయ మహిళలను మోసపూరితంగా వివాహం చేసుకుంటున్న ఎన్ఆర్ఐలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ‘‘ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఇండియన్ బిల్లు 2019’’ ని గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
దీని ప్రకారం ఎవరైనా ఎన్నారై పురుషుడు పెళ్లయిన 30 రోజుల్లోగా తమ వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి.
లేని పక్షంలో అతని పాస్పోర్ట్ని స్వాధీనం చేసుకోవడమో లేదంటే రద్దు చేయడమో జరుగుతుంది.
అలాగే చట్టాన్ని అతిక్రమించిన నేరంపై ఎన్ఆర్ఐలపై వారెంట్లు జారీ చేసినప్పటికీ కోర్టులో హాజరు కాకపోతే అట్టి వారి అన్ని స్థిర, చరాస్థులను కోర్టులు జప్తు చేసుకోవచ్చు.ఇందుకోసం పాస్పోర్ట్ చట్టం 1967, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్ 1973ని సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.
భారతదేశంతో పాటు విదేశాల్లో భారతీయ మహిళలను పెళ్లాడే ఎన్ఆర్ఐలకు ఈ చట్టం వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు.చర్చ తర్వాత దీనిని స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేస్తూ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
జనవరి 1, 2016 నుంచి అక్టోబర్ 31, 2019 మధ్య ఎన్ఆర్ఐ భర్తలు వేధించడంతో పాటు మోసం చేశారంటూ 5,298 ఫిర్యాదులు అందినట్లు స్థాయి సంఘం గుర్తించింది.వివిధ పరిస్ధితుల్లో పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవడానికి, ఉపసంహరించుకోవడానికి చట్టంలో ఇప్పటికే ఒక నిబంధన ఉన్నట్లు కమిటీ తన నివేదికలో తెలిపింది.భారతీయ మహిళను పెళ్లి చేసుకున్న ఎన్ఆర్ఐ తన వివాహాన్ని 30 రోజుల లోపు రిజిస్టర్ చేయించలేదని పాస్పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకొచ్చిన పక్షంలో ఎన్ఆర్ఐ పురుషుడి పాస్పోర్టును స్వాధీనం చేసుకోవడమో, రద్దు చేయడమో జరుగుతుందని కమిటీ తెలిపింది.
నిర్ణీత కాలపరిమితి లోగా ఎన్ఆర్ఐ తన వివాహాన్ని నమోదు చేయని పక్షంలో అతని పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకునే ముందు లుక్ ఔట్ నోటీసు జారీ చేయడం, జరిమానా విధించడం వంటి అంశాలను విదేశీ వ్యవహారాల శాఖ పరిశీలించాలని కమిటీ సిఫారసు చేసింది.
పాస్పోర్ట్, వీసా, శాశ్వత నివాస కార్డు, చిరునామాకు సంబంధించిన వివరాలన్నీంటిని ఇచ్చేలా ఎన్ఆర్ఐ వివాహ రిజిస్ట్రేషన్ ప్రోఫార్మాను మార్చాలని స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది.అంతేకాకుండా ఎన్నారైలు విదేశంలో వారి ఇంటి చిరునామా, ఉపాధి వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని కమిటీ సూచించింది.
విదేశీ వ్యవహారాల మంతిత్వ శాఖ ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా సమన్లు, వారెంట్లు జారీ చేయడానికి కోర్టులకు అధికారం ఇవ్వడానికి 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సవరణ తీసుకురావాలనే ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది.
.