ఎంతో ఘనంగా కూతురి పెళ్లి చేస్తే ఎవరైనా కానుకగా ఇల్లో,కారో,ఖరీదైన బంగారమో ఇలాంటి కానుకలు ఇస్తూ ఉంటారు.కానీ ఈ తండ్రి మాత్రం కొంచం వెరైటీ గా కూతురికి ఎంతో ఇష్టమైన పుస్తకాలను కానుకగా కూతురికి ఇచ్చి అత్తారింటికి పంపించారు.
ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్ లో చోటుచేసుకుంది.ఎంతో ఘనంగా కూతురు పెళ్లి చేసిన ఆ తండ్రి కానుకలుగా నగలు,బట్టలు,ఇతరత్రా ఖరీదైనవి కాకుండా పవిత్ర గ్రంధాలు,పుస్తకాలు,రాతప్రతులు బహుమానంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే… గుజరాత్ రాజ్ కోట్ కు చెందిన హార్డెవ్ సింగ్ జడేజా వృత్తి రీత్యా టీచర్.ఆయన కుమార్తె కిన్నారి బా కు చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు అంటే చాలా ఇష్టం.
అందుకే చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా వందల పుస్తకాలతో ఒక పెద్ద లైబ్రరీ నే ఏర్పాటు చేసింది అంటే అతిశయోక్తి కాదేమో.అయితే కిన్నారి కి వడోదర కు చెందిన ఇంజనీర్ పూర్వాజిత్ సింగ్ తో వివాహం ఫిక్స్ అయ్యింది.దీనితో తండ్రికి తనకు ఎలాంటి ఖరీదైన కానుకలు వద్దని చెప్పిన కిన్నారి కానుకలు బదులు పుస్తకాలను ఇవ్వాలని తండ్రిని కోరింది.అయితే మొదటి నుంచి కూతురి ఇష్టాయిష్టాలను ప్రాధాన్యత ఇచ్చే హార్డెవ్ ఆమె అడిగినట్లుగానే పుస్తకాలను కానుకగా అందించడానికి నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో గారాల కూతురికి ఎలాంటి పుస్తకాలు ఇష్టమో ఓ లిస్ట్ రెడీ చేసుకున్నాడు హర్దేవ్ సింగ్.ఆరు నెలలపాటూ ఢిల్లీ, కాశీ, బెంగళూరు, ఇతర నగరాల్లో తిరిగి రకరకాల పుస్తకాలు సేకరించారు.
తన కూతురు ఎంత బరువు ఉందొ,అంత బరువుకు సరిపడా పుస్తకాల్ని ఆయన తన గారాల కూతురు కు బహుమతిగా అందించడం విశేషం.
దీనితో కిన్నారి మొత్తం 2200 పుస్తకాలతో తన అత్తగారింట్లో అడుగుపెట్టింది.హార్డెవ్ బహుమతిగా ఇచ్చిన పుస్తకాల్లో మామూలు పుస్తకాలతోపాటూ… మహారుషి వేద వ్యాసుడు, 18 పురాణాలు, ఖురాన్, బైబిల్ సహా పవిత్ర గ్రంథాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఎవరు ఎలా ఉన్నా తండ్రి అందించిన కానుకకు కిన్నారి మాత్రం పరమానందం పొందింది.