ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలలో వస్తున్న ఫలితాలు ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి.చాలా జిల్లాలలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మొదటి, రెండు దశ పంచాయతీ ఎన్నికలలో చాలావరకు వైసిపి పార్టీ మద్దతుదారులు గెలిచినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి తరుణంలో రాయలసీమలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉండే అనంతపురంలో పంచాయతీ ఎన్నికలలో ఓటమిని తట్టుకోలేక టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం అందరికీ విస్మయానికి గురి చేసింది.
పూర్తి విషయంలోకి వెళితే అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించాడు.
దీంతో ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ అభ్యర్థి ఈడిగ నాగేంద్రప్ప ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ పరిణామంతో ఆ గ్రామంలో ఉన్న టీడీపీ కేడర్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.