బీజేపీ వైసీపీ మధ్య ఇప్పుడు పల్నాడు వార్ హోరాహోరీగా సాగబోతున్నట్టుగా కనిపిస్తోంది.ఇప్పటికే ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ రాజకీయంగా తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టుగా అర్ధం అవుతోంది.
తాజాగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటడం, పల్నాడు ప్రాంతంలో రాజకీయ దాడులు, ఇసుక కొరత వంటి ప్రధానమైన ప్రజా సమస్యలపై పల్నాడు కేంద్రంగా గురజాల ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నాకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సిద్ధం అయ్యారు.అయితే పల్నాడులో ఆ పార్టీ నిర్వహించ తలపెట్టిన బహిరంగసభకు పోలీసులు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.
ఈ మేరకు బీజేపీ నాయకులు తగిన ఏర్పాట్లు చేసుకున్న గురజాలలో 144 సెక్షన్ విధించారు.గురజాలకు వెళ్తున్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను.
సత్తెనపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గురజాలలో పోలీసు ఆంక్షలు ఉన్నందున వెళ్లడానికి వీరు లేదని స్పష్టం చేశారు.
ఇటీవలే టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ఆందోళన చేపట్టిన క్రమంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టు సమాచారం.టీడీపీ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన చలో ఆత్మకూరు కార్యక్రమంపై పోలీసులు తీవ్ర నిర్బంధాలు అమలు చేయడంతో అప్పట్లో చాలా విమర్శలే చెలరేగాయి.అయినప్పటికీ పోలీసులు బీజేపీ కార్యక్రమం మీద కూడా అదే స్థాయిలో ఆంక్షలు అమలుచేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.బీజేపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయకపోయినా, గురజాలకు వెళ్లకుండా అడ్డుకుని వారి బహిరంగసభను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు.
వైసీపీ వందరోజుల పరిపాలనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలో బహిరంగసభలో మరింత ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉండడంతో ఉద్రిక్తతల పేరుతో సభను అడ్డుకున్నట్టు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.దీనిపై కన్నా స్పందిస్తూ అసలు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ మండిపడుతున్నారు.పల్నాడు ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించేందుకు వెళ్తుంటే పోలీసులతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని వెనక్కి పరిగెత్తిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు.ఈ పరిణామాలన్నిటిని పరిగణలోకి తీసుకుంటే వైసీపీ ప్రభుత్వంపై ఇక స్పీడ్ పెంచాలనే ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
అయితే ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం వైసీపీతో స్నేహపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తోంది.ఇక వైసీపీ కూడా బీజేపీతో సన్నిహితంగానే మెలుగుదామనే ఆలోచనతోనే ఉన్నా ఏపీలో మాత్రం అందుకు తగ్గ పరిస్థితులు కనిపించడంలేదు.
ప్రస్తుతం వైసీపీ బీజేపీ మధ్య మొదలయిన ఈ పల్నాడు యుద్ధం ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి.