భారత్-పాకిస్తాన్ అంటే భావోద్వేగాలు ఎలా ఉంటాయో తెలిసిందే.సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం… ఒకరినొకరు శత్రువల్లా భావించుకోవడం తెలిసిందే.
ఇలాంటి పరిస్ధితుల్లో భారతీయులంటే తమకు స్నేహితులేనని నిరూపించాడు ఓ పాకిస్తాన్ క్యాబ్ డ్రైవర్.తన ట్యాక్సీలో పర్సును పొగొట్టుకున్న భారతీయ యువతికి తిరిగి ఇచ్చి స్నేహ భావాన్ని చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే… కేరళకు చెందిన రాచెల్ రోజ్ అనే భారతీయ యువతి తన కుటుంబంతో కలిసి దుబాయ్లో నివాసం ఉంటున్నారు.యూకేలోని లాంకాస్టర్ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు.
ఇటీవల సెలవుల కోసం దుబాయ్ వచ్చిన రోజ్… స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో జనవరి 4న నగరంలోని బుర్జుమాన్ దగ్గరలో సాయంత్రం రోజ్ తన స్నేహితులతో కలిసి పాకిస్తాన్కు చెందిన ఖాదీమ్ ట్యాక్సీ ఎక్కారు.
అయితే మరోకారులో వారి స్నేహితులు ఉండటంతో ఆ కారు దిగారు.ఆ కంగారులో తన పర్సును ట్యాక్సీలో మరిచిపోయారు.అందులోనే ఎమిరేట్స్ ఐడీ, యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, క్రెడిట్ కార్డు, కొంత నగదు సైతం ఉన్నాయి.ఈ సంగతిని తర్వాత గుర్తించిన రోజ్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సోమవారం ముఖ్యమైన పరీక్షకు హాజరుకావాల్సి ఉంది.అయితే వీసాకు చెందిన కాపీ తన వద్ద లేకపోవడంతో ఆమె పరిస్ధితి దారుణంగా తయారైంది.
చివరికి ఆమె వాలెట్ను పొగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.సీసీటీవీ కెమెరా సాయంతో రోజ్ ఎక్కిన కారును గుర్తించేందుకు పరిశీలించినప్పటికీ అక్కడా ఫలితం దక్కలేదు.
రోజ్ పాకిస్తాన్కు చెందిన డ్రైవర్ కారు ఎక్కి.వెంటనే దిగిపోవడంతో అతను మీటర్ను ఆన్ చేయకపోవడం గుర్తింపుకు కష్టంగా మారింది.ఇదే సమయంలో సదరు పాకిస్తాన్ డ్రైవర్ రోజ్ దిగిన తర్వాత రెండు ట్రిప్పులు వేసిన అనంతరం కారులో వాలెట్ను గుర్తించాడు.అయితే దాని యజమానికి సంబంధించిన సమాచారం అందులో లేకపోవడంతో దుబాయ్లోని ఆర్టీఏ కాల్సెంటర్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా రోజ్ అడ్రస్ కోసం ప్రయత్నించగా సమయం మించి పోయింది.అయితే తెల్లవారుజామున ఆర్టీఏ కాల్సెంటర్ నుంచి ఖాదీమ్కు ఫోన్ వచ్చింది.రోజ్ వివరాలను అతనికి చెప్పడంతో ఖాదీమ్ వాలెట్ను రోజ్కు అందజేశాడు.దీనిపై తీవ్ర సంతోషం వ్యక్తం చేసిన రోజ్ తండ్రి సంతోషంతో ఖాదీమ్కు 600 దినార్లు బహుమానంగా అందించాడు.
అయితే ఆమెను తన సోదరిగా భావించి సాయం చేశానని తనకు డబ్బు అవసరం లేదని ఖాదీమ్ తిరస్కరించాడు.