పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన తర్వాత ప్రతీకారంతో రగిలిపోయిన పాకిస్తాన్ భారత్ పై దాడులకి ప్రయత్నించిన సంగతి అందరికి తెలిసిందే.ఆ సమయంలో పాకిస్తాన్ రక్షణ కోసం అమెరికా ఇచ్చిన ఎఫ్ 16 యుద్ధ విమానాలని పాకిస్తాన్ ఉపయోగించింది.
అయితే పాకిస్తాన్ ప్రయోగించిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని అభినంధన్ దాడి చేసి కూల్చేశారు.దీనిని భారత్ కూడా ద్రువీకరించింది.
బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసినందుకు ప్రతీకారంగా ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ఉపయోగించిందన్న భారత్ వాదనలను పాకిస్థాన్ ఇన్ని రోజులు వరకు తిరస్కరిస్తూ వచ్చింది.
అయితే తాజాగా భారత్ పై ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని ప్రయోగించినట్లు పాకిస్తాన్ సైనిక ప్రతినిధి అంగీకరించారు.
పాకిస్థాన్ గగనతలంలోకి చొరబడిన భారతీయ వాయుసేనకి చెందిన రెండు యుద్ధవిమానాలను కూల్చేయడానికి జెఎఫ్-17 థండర్ ఎయిర్ క్రాఫ్ట్ వాడామా లేదా అమెరికా తయారుచేసిన ఎఫ్-16 జెట్లనా అనే ప్రశ్న అర్థరహితమని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పుకొచ్చారు.భారత విమానాలు నియంత్రణ రేఖ దాటినపుడు ఎఫ్-16లతో సహా అన్ని పీఎఎఫ్ యుద్ధవిమానాలు గాల్లోకి ఎగిరాయి అని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికాతో ఎఫ్-16ల వినియోగంపై ఉన్న ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపించిన నేపధ్యంలో ఆ దేశం తన తప్పుని కప్పి పుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పింది.అయితే మొదటిసారి తాము ఎఫ్ 16 వాడినట్లు ఒప్పుకోవడంతో అసలు వాస్తవం బయటపడింది.
.